మెగాస్టార్ చిరంజీవికి ప్రధాని మోడీ అభినందనలు

 మెగాస్టార్ చిరంజీవికి ప్రధాని మోడీ అభినందనలు

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక ‘ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022’ అవార్డుకు ఎంపిరకైన సంగతి తెలిసిందే.  దీంతో ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందులో భాగంగా ప్రధాని మోడీ ఆయనకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.  "చిరంజీవి గారు విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్నీ , ఆదరణనూ చూరగొన్నారు. గోవా లో జరుగుతున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో  విశిష్టమైన ఇండియన్  ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎంపికైన సందర్బంగా ఆయనకు అభినందనలు" అంటూ మోడీ ట్వీట్ చేశారు.

సినీ పరిశ్రమకు మెగాస్టార్ చిరంజీవి అందించిన విశేష సేవలకు గానూ ఆయనను కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. ఇప్పటి వరకూ ఈ అవార్డును అమితాబ్‌, సలీమ్‌ఖాన్‌, బిశ్వజిత్ ఛటర్జీ, హేమ మాలిని, ప్రసూన్‌ జోషి, వహీదా రెహమాన్‌, రజనీకాంత్‌, ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అందుకున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2013 నుంచి ‘ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ’ అవార్డు ప్రదానం చేస్తున్నారు. 

అయితే ఈ పురస్కార గ్రహీతకు నెమలి బొమ్మ కలిగిన రజత పతకం, 10లక్షల రూపాయలతో పాటు ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. ఇక చిరు హీరోగా 150కిపైగా సినిమాల్లో నటించారు. నిర్మాతగానూ ఆయన ఎన్నో సినిమాలు నిర్మించారు. ప్రస్తుతం ఆయన ‘వాల్తేరు వీరయ్య’, ‘భోళా శంకర్‌’ మూవీస్ లో నటిస్తున్నారు.