
“పీఎం నరేంద్రమోడీ” పేరుతో తెరకెక్కిన మోడీ బయోపిక్ సినిమా విడుదల వాయిదాపడింది. ఈ విషయాన్ని సినిమా నిర్మాతలు ధ్రువీకరించారు. PM నరేంద్రమోడీ మూవీని ముందుగా ఏప్రిల్ 12న విడుదల చేయాలనుకున్నారు. ఐతే… లోక్ సభ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 11న మొదలు కానుండటంతో… అంతకు ముందుగానే ఏప్రిల్ 5న విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు ప్రొడ్యూసర్స్. ఏప్రిల్ 5న విడుదల చేస్తామని తర్వాత ప్రకటించారు. ఐతే.. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా… సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రాలేదు. మరిన్ని కారణాలు కూడా ఉన్నాయి. సాంకేతిక కారణాల వల్ల PM నరేంద్రమోడీ మూవీని ఏప్రిల్ 5న విడుదల చేయడం సాధ్య పడటం లేదని నిర్మాతలు చెప్పారు. విడుదల తేదీని తర్వాత ప్రకటిస్తామని చెప్పారు.
PM నరేంద్రమోడీ బయోపిక్ ను ఎన్నికల ముందు విడుదల చేసి… ఓటర్లను ప్రభావితం చేయాలనుకుంటున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేశాయి. ఇది ఎన్నికల నియమావళిని పట్టించుకోకపోవడం కిందకే వస్తుందని సతీష్ గైక్వాడ్ అనే వ్యక్తి బాంబే హైకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ఎన్నికలు పూర్తయ్యేదాకా సినిమా విడుదల ఆపాలన్నారు. అటు ఢిల్లీలోని హైకోర్టులు … మోడీ సినిమా విడుదల ఆపాలంటూ వేసిన పిటిషన్లను తోసిపుచ్చాయి. ఈసీలోనూ కంప్లయింట్లు నమోదయ్యాయి. ఈ విషయం CBFC పరిధిలో ఉందని.. వాళ్లే నిర్ణయం తీసుకుంటారని ఈసీ తెలిపింది. ఈ వివాదం ఇలా ఉండగానే.. సినిమా విడుదలను వాయిదా వేస్తున్నామంటూ నిర్మాతలు ఆనంద్ పండిట్, ఆచార్య మనీష్, సందీప్ సింగ్, సురేష్ ఒబెరాయ్ చెప్పారు.
టైటిల్ రోల్ పోషించిన వివేక్ ఒబెరాయ్ .. సినిమా వివాదంపై స్పందించారు. ఎన్నికల ముందు సినిమా రిలీజ్ డేట్ అనేది యాక్సిడెంటల్ గా వచ్చిందేననీ.. ఉద్దేశించి చేసింది కాదన్నారు. మోడీని హీరోగా చూపించాల్సిన అవసరం తమకు లేదన్నారు. నరేంద్రమోడీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భారతీయులకు హీరోనే అని చెప్పారు వివేక్ ఒబెరాయ్.
RSS కార్యకర్త అయిన ఓ చాయ్ వాలా.. ప్రజాప్రతినిధిగా, సీఎంగా, ప్రధానమంత్రిగా ఎలా ఎదిగాడన్నది పీఎం నరేంద్రమోడీ బయోపిక్ లో చూపించామని మేకర్స్ చెప్పారు. దేశభక్తిని హై పొటెన్షియల్ లో చూపించడంతో ట్రైలర్ అంతటా ఆసక్తి రేపింది. మూవీ విడుదల కోసం సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది.