- ఆస్పత్రిలో చేరిన ప్రధాని మోడీ తల్లి
- ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించిన డాక్టర్లు
- దవాఖానకు వెళ్లి తల్లిని పరామర్శించిన పీఎం
- త్వరగా కోలుకోవాలంటూ ఖర్గే, రాహుల్, ప్రియాంక ట్వీట్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోడీ ఆనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. మంగళవారం రాత్రి ఆమె అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆమెను అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్లో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు బుధవారం ప్రకటన విడుదల చేశాయి. తల్లి అనారోగ్యం గురించి తెలుసుకున్న ప్రధాని వెంటనే అహ్మదాబాద్ చేరుకున్నారు. ఆస్పత్రికి వెళ్లి తల్లిని పరామర్శించారు. మోడీతో పాటు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కూడా ఉన్నారు. తల్లిని చూసిన తర్వాత కాసేపటికి మోడీ తిరిగి వెళ్లిపోయారు. మీకు మద్దతుగా మేమున్నం.. హీరాబెన్ త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ట్వీట్ చేశారు. ‘‘హీరాబెన్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో మోడీకి మద్దతుగా మేమున్నాం” అని ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, డీకే అరుణ ట్వీట్ చేశారు.
ప్రహ్లాద్ మోడీ కోలుకున్నరు
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రధాని మోడీ సోదరుడు, కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారని డాక్టర్లు బుధవారం ప్రకటించారు. కొడుకు, కోడలు, మనవడితో కలిసి ప్రయాణిస్తున్న ప్రహ్లాద్ మోడీ కారు మంగళవారం మైసూరు దగ్గరలో డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న వాళ్లందరికీ స్వల్ప గాయాలయ్యాయి. ‘‘మాకు చిన్నపాటి గాయాలయ్యాయి. అందరమూ బాగానే ఉన్నాం, చింతించాల్సిన పనిలేదు”అని ప్రహ్లాద్ మోడీ వెల్లడించారు.