2023 ఆగస్టు 23న చంద్రుడిపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 26 ఉదయం బెంగళూరు చేరుకున్నారు. అయితే ఆయనను రిసీవ్ చేసుకోవడానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య , డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బెంగళూరు విమానాశ్రయానికి రాలేదు. మోదీ ఉద్దేశపూర్వకంగానే వారిని ఎయిర్పోర్టుకు రావొద్దన్నారని కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించింది.
‘తనకంటే ముందు కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించడంపై మోదీ చాలా చికాకుగా ఉన్నారు. అందుకే ప్రొటోకాల్కు విరుద్ధంగా.. వారిద్దరిని ఉద్దేశపూర్వకంగా ఎయిర్పోర్టుకు రాకుండా ఆపేశారు. ఇలాంటి రాజకీయాలు హాస్యాస్పదం. చంద్రయాన్-1 విజయం వేళ.. 2008లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కంటే ముందు గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ.. అహ్మదాబాద్లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్కు వెళ్లారు. ఆ విషయాన్ని మోదీ మర్చిపోయారా..?’అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.
దీనిపై ప్రధాని మోదీ స్పష్టత ఇచ్చారు. తాను బెంగళూరుకు ఎప్పుడు చేరుకుంటానో తనకు తెలియదు. అందుకే ప్రొటోకాల్ విషయంలో గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎంలను ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నాను.. అందుకే వారిని రావొద్దని చెప్పానన్నారు. శుక్రవారం గ్రీస్ దేశంలో పర్యటించిన మోదీ.. అక్కడినుంచి శనివారం ఉదయం బెంగళూరుకు బయలుదేరారు. అనంతరం శాస్త్రవేత్తలతో మాట్లాడి వారి కృషికి సెల్యూట్ చేశారు.