- స్టేషన్కు వచ్చే వారితో మర్యాదగా ప్రవర్తించేలా క్లాసులు
హైదరాబాద్, వెలుగు: యూనిఫామ్ సర్వీసెస్లో చేరుతున్న సిబ్బంది ట్రైనింగ్లో పోలీస్ డిపార్ట్మెంట్ కీలక మార్పులు చేపట్టింది. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు సెలెక్ట్ అయినవారికి వినూత్న రీతిలో ట్రైనింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఆగస్ట్ మొదటి వారంలో ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో సెలెక్ట్ అయ్యే అభ్యర్థులకు ఆగస్ట్ రెండవ వారం నుంచి ట్రైనింగ్ ప్రారంభించనున్నారు. పోలీస్ అకాడమీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 28 సెంటర్స్లో 14,881 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. ట్రైనింగ్ ఐజీ తరుణ్ జోషి ఆధ్వర్యంలో ఈ మేరకు శిక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ట్రైనింగ్ లో కీలక మార్పులు చేశారు. కేసుల దర్యాప్తులో టెక్నాలజీ వినియోగం, సైబర్ నేరాలను అరికట్టే విధంగా స్పెషల్ క్లాస్ లు నిర్వహించనున్నారు.
బిహేవియర్లో మార్పు తెచ్చేలా..
ప్రధానంగా పోలీసుల బిహేవియర్లో మార్పులు తెచ్చే విధంగా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరించాల్సిన అంశాలపై ఇండోర్ ట్రైనింగ్లో కీలక మార్పులు చేయనున్నారు. టెక్నాలజీ, సైబర్ క్రైమ్స్ దర్యాప్తుపై పట్టు సాధించే విధంగా పాఠ్యాంశాలను ప్రవేశపెడుతున్నారు. లా అండ్ ఆర్డర్ డ్యూటీతో పాటు డ్రగ్స్, గంజాయి ట్రాన్స్పోర్ట్ తదితర అంశాలపై మరింత అవగాహన పెంచేలా క్లాస్ లు నిర్వహించనున్నారు. విధి నిర్వహణలో పోలీసులు మానసిక ఒత్తిడిని తట్టుకునేలా స్ట్రెస్ మేనేజ్మెంట్, ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా పాఠ్యాంశాలు రూపొందించారు. అయితే, ఔట్డోర్ ట్రైనింగ్లో మాత్రం మార్పులు తక్కువగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.