నిర్మల్లో ఉద్రిక్తత.. బీజేపీ నేతలపై పోలీసుల లాఠీచార్జ్

నిర్మల్లో ఉద్రిక్తత.. బీజేపీ నేతలపై పోలీసుల లాఠీచార్జ్

నిర్మల్ లో ఉద్రిక్తత ఏర్పడింది. బీజేపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. నిర్మల్ మున్సిపాలిటీ న్యూ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బీజేపీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ ముందు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. 

రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. తక్షణమే నిర్మల్ మున్సిపాలిటీ న్యూ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. ఆందోళన చేయవద్దని పోలీసులు చెప్పినా వినకపోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది.

పెద్ద సంఖ్యలో అక్కడే మోహరించిన పోలీసులు... బలవంతంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని.. స్టేషన్ కు తరలించారు. రాస్తారోకో చేస్తున్న బీజేపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. 

నిర్మల్ టౌన్  న్యూ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష 4వ రోజు కొనసాగుతోంది. గంట గంటకు మహేశ్వర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మహేశ్వర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి పట్ల బీజేపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.