
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఫోన్, ల్యాప్ టాప్ ను సిట్ సీజ్ చేసింది . వాటిని ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కు పంపించారు.
2023 నవంబర్ 15 నుంచి 30 వరకు అందిన సర్వీసు ప్రొవైడర్ డేటాలో 618 ఫోన్ నెంబర్లను సిట్ గుర్తించినట్టు తెలుస్తోంది. ప్రభాకర్ రావు.. పలువురు బీఆర్ఎస్ నేతలతో, పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపినట్టు అనుమానం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ధ్వంసమైన హార్డ్ డిస్కులలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన డేటా ఉన్నట్టు సమాచారం. ఇక జూలై 14న విచారణకు రావాలని ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ ఆదేశించింది. ఎఫ్ఎస్ఎల్ ఇచ్చే నివేదిక, సాక్షుల స్టేట్ మెంట్ ఆధారంగా మరోసారి ప్రశ్నించనుంది.
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు మొత్తం 618 మంది పొలిటీషియన్ల ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. అలాగే, అందరితో కలిపి మొత్తం 4,200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. అసెంబ్లీ ఎన్నికలకు విఘాతం కలిగించే కుట్ర చేస్తున్నారని, మావోయిస్టు సానుభూతిపరుల నెపంతో ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు టీం అదే ఏడాది నవంబర్లో సర్వీస్ ప్రొవైడర్లకు లిస్ట్ పంపింది.
ALSO READ : ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చా..మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలి: మంత్రి సీతక్క
ఈ లిస్ట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత డిసెంబర్ మొదటి వారంలో ఎస్ఐబీకి చేరింది. ఆయా నంబర్లు ట్యాపింగ్ లో ఉన్నట్లు సంబంధిత టెలికాం కంపెనీలు ఎస్ఐబీకి లిస్ట్ పంపించాయి. అప్పటికే బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సర్వీస్ ప్రొవైడర్లు అందించిన లిస్ట్ లో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ సహా కాంగ్రెస్లో కీలక నేతలు, బీజేపీ నేతలు, ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు , వైఎస్ షర్మిల, కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు, ముఖ్య అనుచరులకు నంబర్లను సిట్ గుర్తించింది. ఆయా నంబర్లకు ఫోన్లు చేసి సాక్షుల స్టేట్మెట్లు రికార్డు చేస్తున్నది.