తెలంగాణ రాష్ట్రానికి కాబోయే సీఎం రేవంత్ రెడ్డినివాసం వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. హైదరాబాద్ లోని రేవంత్ ఇంటివద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేవంత్ నివాసం వద్ద భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నారు పోలీస్ అధికారులు. రేవంత్ నివాసం నుండి బయటకు వచ్చే రూట్ను పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది క్లియర్ చేస్తున్నారు. రేవంత్ నివాసానికి 200 మీటర్ల దూరంలోనే బారీకేడ్లు వేసి ఆంక్షలు విధించారు. ఇప్పటికే రేవంత్ నివాస పరిసర ప్రాంతాలను ఇంటెలిజెన్స్ పోలీసులు పరిశీలించారు. రేపు ఉదయం జూబ్లీ హిల్స్ ఇంటి నుంచే ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రమాణ స్వీకరానికి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు.
మరోవైపు ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ అగ్రనేతలను రేవంత్ కలుస్తున్నారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన రేవంత్ .. కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖర్జున ఖర్గేతో కూడా భేటీ అయ్యారు. ఎల్బీ స్టేడియంలో రేపు జరగబోయే తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా కోరారు. మరికాసేపట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ లను కలిసి వారిని కూడా ఆహ్వానించనున్నారు. అనంతరం మంత్రివర్గ కూర్పుపై చర్చించనున్నారు.
2023 డిసెంబర్ 07వ తేదీ గురువారం ఉదయం 10.28 గంటలకు ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో రేవంత్ సహా 9 లేదా 18 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉందని సమాచారం. సీఎంగా రేవంత్ తోపాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు, 12 మంది మంత్రులూ ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. బుధవారం హైకమాండ్ భేటీలో వీటిపై క్లారిటీ రానున్నట్లు సమాచారం. కేబినెట్లో చోటుదక్కించుకునేది వీళ్లేనంటూ పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.