నస్పూర్/కోల్బెల్ట్, వెలుగు : ఇటుకల చాటున అక్రమంగా రవాణా చేస్తున్న 5 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ట్రాక్టర్బోల్తా పడడంతో ఈ అక్రమ రవాణా బాగోతం బయటపడింది. శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు సిమెంటు, ఇటుకల బస్తాల్లో గంజాయిని దాచారు. ఆ సరుకును ట్రాక్టర్లో చెన్నూరు మార్గంలో మంచిర్యాల వైపు తరలిస్తున్నారు. అయితే, ఆ ట్రాక్టర్ శ్రీరాంపూర్– సింగరేణి జీఎం ఆఫీసుసమీపంలోని నేషనల్హైవే పక్కన బోల్తా పడింది.
దీంతో నిందితులు ఆ వాహనాన్ని విడిచి పారిపోయారు. సిమెంటు, ఇటుకల లోడ్ కావడం, వర్షం కురవడంతో మొదట ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. శనివారం సాయంత్రం పొద్దుపోయాక శ్రీరాంపూర్ పోలీసులు జేసీబీ సాయంతో ట్రాక్టర్ ట్రాలీని పైకి లేపించారు. దీంతో ఇటుకలతో పాటు కవర్చుట్టి ఉన్న కొన్ని బస్తాలు బయటపడ్డాయి. వాటిని తెరిచిచూడగా గంజాయిగా తేలింది. ఆ గంజాయి మొత్తం 5 క్వింటాళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.
ట్రాక్టర్, గంజాయి బస్తాలను పోలీస్స్టేషన్కు తరలించారు. ట్రాక్టర్కు ఎలాంటి నంబర్ లేకపోవడంతో పక్కా ప్లానింగ్తోనే నిందితులు గంజాయిని తరలిస్తున్నారని, ఛత్తీస్గఢ్నుంచి సరుకును తీసుకొస్తున్నట్లు భావిస్తున్నారు. గంజాయిని ఎక్కడికి తరలిస్తున్నారు? దీని వెనుక ఎరున్నారనే విషయంపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు. నేషనల్ హైవే మార్గంలోని సీసీటీవీ కెమెరాల సాయంతో దర్యాప్తు చేస్తున్నామని శ్రీరాంపూర్ ఎస్సై రాజేశ్ తెలిపారు.