అచ్చంపేటలో అర్ధరాత్రి హైడ్రామా .. దాడులు చేసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ ​కార్యకర్తలు

అచ్చంపేటలో అర్ధరాత్రి హైడ్రామా .. దాడులు చేసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ ​కార్యకర్తలు
  • ఎమ్మెల్యే గువ్వల డబ్బులు తరలిస్తున్నారని వెంబడించిన కాంగ్రెస్​ శ్రేణులు
  • వాహనాలను అడ్డుకున్న కార్యకర్తలు 
  • పోలీసుల లాఠీచార్జి

అచ్చంపేట, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం రాత్రి నాగర్​కర్నూల్ ​జిల్లా అచ్చంపేటలో హైడ్రామా నడిచింది. శనివారం రాత్రి అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హైదరాబాద్ కు చెందిన వాహనాల్లో ఓటర్లకు పంచేందుకు పెద్దమొత్తంలో డబ్బులు తరలిస్తున్నాడనే అనుమానంతో కాంగ్రెస్​ కార్యకర్తలు ఉప్పునుంతల మండలం వెల్టూర్​గేట్​ నుంచి వెహికల్స్​ను ఫాలో అయ్యారు. అదే సమ యంలో అచ్చంపేటలోని కాంగ్రెస్ ​శ్రేణులను అలర్ట్ చేశారు.

వెహికల్స్​అచ్చంపేట అంబేద్కర్​ చౌరస్తా వద్దకు చేరుకోగానే కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్​ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో పాటు దాడులు చేసుకున్నారు. పోలీసులు తమ లీడర్లపైనే దాడులు చేశారని, బీఆర్ఎస్​ తరలిస్తున్న డబ్బుల బ్యాగులను తప్పించేలా సహకరించారని కాంగ్రెస్ ​నేతలు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో పాటు డీసీసీ అధ్యక్షుడు డాక్టర్​వంశీకృష్ణ ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాలు మరోసారి దాడులు చేసుకున్నాయి. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో పోలీసులు లాఠీచార్జ్​చేసి రెండు వర్గాలను చెదరగొట్టారు. 

సినిమా చూపిస్తామన్న సీఐ అనుదీప్​

కాంగ్రెస్ ​లీడర్లు అంబేద్కర్​ చౌరస్తా దగ్గర ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న సీఐ అనుదీప్, సిబ్బందితో కలిసి​ అక్కడికి వెళ్లారు. బైఠాయించిన డీసీసీ అధ్యక్షుడు డాక్టర్​ వంశీకృష్ణ, ఇతర లీడర్లు, కార్యకర్తలతో  ఒకింత బెదిరింపు స్వరంతో మాట్లాడారు. ‘మీరు అనుకుంటున్నారేమో సినిమా అంతా ఉంది.. దాడులు చేసి ధర్నాలకు దిగుతారా? ప్రజలంతా గమనిస్తున్నారు. వాహనాలను ఎవరు అడ్డుకున్నారో.. ఎవరు ఏం చేశారో అంతా ఉంది..మీకు సినిమా చూపిస్తాం’ అంటూ కామెంట్స్​ చేశారు. దీంతో ఈ వీడియోను కాంగ్రెస్ ​లీడర్లు సోషల్​మీడియాలో వైరల్ ​చేశారు.  

హైదరాబాద్​ హాస్పిటల్​కు ఎమ్మెల్యే..! 

కాంగ్రెస్ దాడిలో ఎమ్మెల్యే బాలరాజు స్వల్పంగా గాయపడ్డాడని, ఇంటికి చేరుకున్న తర్వాత స్పృహ కోల్పోయాడని చెబుతూ ఆయన అనుచరులు అచ్చంపేట హాస్పిటల్​లో చేర్పించారు. డాక్టర్లు చికిత్స చేసిన తర్వాత హైదరాబాద్​కు రెఫర్​ చేశారు. కాంగ్రెస్ ​లీడర్లు రౌడీయిజం చేస్తూ బీఆర్ఎస్ ​నేతలపై దాడులకు దిగారని ఆరోపిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు అచ్చంపేట హాస్పిటల్​ ముందు శ్రీశైలం, నాగర్ కర్నూల్ మెయిన్​రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేపై దాడి చేసిన వంశీకృష్ణ, అతని అనుచరులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 

అడ్డంగా దొరికిపోయి డ్రామాలాడుతున్నరు

ఎమ్మెల్యే గువ్వల ఓటర్లకు పంచేందుకు డబ్బులు తరలిస్తూ అడ్డంగా దొరికిపోయి డ్రామాలాడుతున్నారని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్​ ​వంశీకృష్ణ ఆరోపించారు. కాంగ్రెస్​ లీడర్లు, కార్యకర్తలపై దాడులకు దిగడం అప్రజాస్వామికమన్నారు. డబ్బుల బ్యాగులను తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్న కాంగ్రెస్ ​శ్రేణులపై ఎమ్మెల్యే దాడులకు దిగారని, వారికి అచ్చంపేట పోలీసులు వత్తాసు పలికారన్నారు. కాంగ్రెస్ ​కార్యకర్తలు, లీడర్లపై దాడులకు దిగిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై ఎలక్షన్​ కమిషన్​కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అచ్చంపేట సీఐతోపాటు మరి కొంత మంది ఎస్ఐలపై కూడా ఈసీకి కంప్లయింట్​చేస్తామన్నారు. కాగా, ఈ ఘటనపై అచ్చంపేట పోలీస్ స్టేషన్​లో కాంగ్రెస్, బీఆర్ఎస్  నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.