- రాష్ట్రాన్ని అప్పులమయం చేసిన బీఆర్ ఎస్ కు నిరసన తెలిపే హక్కు లేదు : మంత్రి పొన్నం
హుస్నాబాద్ (అక్కన్నపేట), వెలుగు : గౌరవెల్లి ప్రాజెక్ట్ కాల్వల భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.250 కోట్లు విడుదల చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. 'పల్లె పల్లెకు పొన్నం అన్న, పల్లె పల్లెలో ప్రజా పాలన' కార్యక్రమంలో భాగంగా సోమవారం అక్కన్నపేట మండలంలోని కట్కూర్, దుబ్బతండా, దాసుతండా, కన్నారం, చాపగానితండా, పంతులుతండా గ్రామాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గౌరవెల్లి కాల్వలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను త్వరలోనే పూర్తి చేసి, 20 ఏండ్లుగా పరిహారం కోసం ఎదురుచూస్తున్న రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి త్వరలో గౌరవెల్లి ప్రాజెక్టును సందర్శిస్తారని చెప్పారు. రాష్ట్రాన్ని అప్పులమయం చేసి, ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిన బీఆర్ఎస్ నాయకులకు నిరసనలు తెలిపే హక్కు లేదన్నారు.
బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో చేసిన నిర్వాకం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి దారుణంగా తయారైందని మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. బీఆర్ఎస్ లీడర్లు ఉనికి కోసమే నిరసన ప్రదర్శనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తమ లక్ష్యమన్నారు.
రైతులు సబ్సిడీని వినియోగించుకొని ఆయిల్పామ్ సాగు చేయాలని సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అనంతరం హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్లోని శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలో హాస్టల్ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.ని కార్యక్రమంలో వర్సిటీ వీసీ ఉమేశ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి పాల్గొన్నారు.
