అప్లికేషన్ల వరకేనా.. పట్టాలిస్తరా?

అప్లికేషన్ల వరకేనా.. పట్టాలిస్తరా?
  • 2014లో 4.52 లక్షల అప్లికేషన్లు వస్తే.. 1.21లక్షల మందికే పట్టాలు
  • మళ్లీ ఉత్తర్వులతో మరిన్ని పెరగనున్న దరఖాస్తులు
  • ఈసారైనా పట్టాలు వస్తాయో.. రావోనని పేదల ఆందోళన

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ జాగలు, అర్బన్​సీలింగ్​ యాక్ట్​ పరిధిలోని భూముల్లో ఇండ్లు కట్టుకున్న పేదలు రెగ్యులరైజేషన్​ కోసం అప్లికేషన్లు పెట్టుకున్నా.. సర్కారు అందరికీ పట్టాలు ఇవ్వడం లేదు. పేదల ఇంటి స్థలాల రెగ్యులరైజేషన్‌‌‌‌‌‌‌‌ కోసం సర్కారు 2014లో 58, 59 జీవోలు తీసుకు రాగా  లక్షలాది మంది పేదలు దరఖాస్తులు పెట్టుకున్నారు. కానీ ప్రభుత్వం వారిలో 30 శాతం మందికి కూడా పట్టాలియ్యలేదు. ఇటీవల మళ్లీ రెగ్యులరైజేషన్​కు అవకాశం ఇచ్చింది. ఈసారైనా.. పట్టాలు వస్తయో రావోనని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్చి31 వరకు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. 

కొన్నింటికే అనుమతులు
2014లో జీవో నెంబర్​58 కింద వచ్చిన 3.48 లక్షల అప్లికేషన్లను ప్రాసెస్​చేసిన సర్కారు ఇందులో 1.04 లక్షల మందికే పట్టాలు ఇచ్చింది. దాదాపు రెండులక్షలకు పైగా అప్లికేషన్లను అధికారులు రిజెక్ట్​చేశారు. 59 జీవో ప్రకారం రెగ్యులరైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకునేవాళ్లు ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్, ఎలక్ర్టిసిటీ బిల్లు, వాటర్ బిల్లు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏదో ఒక రిసిప్ట్ ను ప్రూఫ్ గా సమర్పించాల్సి ఉంటుంది. 59 జీవో కింద దాదాపు 48,575 దరఖాస్తులు ప్రాసెస్​ చేయగా.. ఇందులో కేవలం17,456 మాత్రమే అప్రూవల్​చేశారు. ఇక ఎక్సెస్​ సీలింగ్​ల్యాండ్​లో రెగ్యులరైజేషన్​కు 2016లో జీవో నెంబర్​92 తీసుకొచ్చారు. దీనికింద 7,867 అప్లికేషన్లు తీసుకోగా..1,112 మందికి పట్టాలు ఇచ్చారు. ఇక 2019లోనూ  సింగరేణి ప్రభుత్వానికి హ్యాండోవర్​ చేసిన ల్యాండ్స్ లో ఆక్రమణలను రెగ్యులర్​ చేసేందుకు జోవో నెంబర్​76ను తీసుకువచ్చారు. ఇందులోనూ 26,909 అప్లికేషన్లు రాగా.. ఇంకా ప్రాసెస్​దశలోనే ఉంది. రెగ్యులరైజేషన్​కు సర్కారు మళ్లీ అవకాశం ఇవ్వడంతో ఈసారి కూడా లక్షల్లోనే అప్లికేషన్లు వస్తాయని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. గతంలో దరఖాస్తు చేసుకుని పట్టాలు రాని వాళ్లు మళ్లీ అప్లికేషన్లు పెట్టుకునేందుకు రెడీ అయ్యారు. అయితే అర్హులందరికీ పట్టాలు ఇస్తరా? కొందరికే ఇచ్చి సరిపెడతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

2014 కంటే ముందువాళ్ల పరిస్థితి ఏంది!
58, 59 జీవోల ప్రకారం.. 2014 కంటే ముందే ప్రభుత్వ స్థలంలో కట్టుకున్న పేదల ఇండ్లకు మాత్రమే రెగ్యులరైజేషన్​వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. దీంతో ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకొని అవసరాలకు నోటరీ ద్వారా విక్రయిస్తే కొనుగోలు చేసిన ఇంటి ఓనర్ల పరిస్థితి గందరగోళంలో పడింది. 2014 కంటే ముందు కరెంట్​బిల్లు, ఇంటి పన్ను, నోటరీ సహా ఎలాంటి ఆధారాలు వారి వద్ద లేవు. దీంతో ఇప్పుడు రెగ్యులరైజేషన్​కు అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వం తమకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

కరెంట్​బిల్లు, నోటరీ లేవు..
ఇంటి రెగ్యులరైజేషన్​కోసం మీసేవకు వెళ్తే.. 2014 కంటే ముందు కరెంట్​బిల్లు, నోటరీ, హౌస్​ట్యాక్స్​కావాలంటున్నారు. 20 ఏండ్ల కింద నేను జాగ కొనుక్కొని ఇల్లు కట్టుకున్న. అప్పట్లో జాగ అమ్మినోళ్లు నాకు నోటరీ ఇయ్యలేదు. వాళ్లు ఇయ్యకుండా నా దగ్గర నోటరీ ఎలా ఉంటుంది. కరెంట్​బిల్లు కూడా 2014 కంటే ముందుది లేదు. ప్రభుత్వం మ్యానువల్​గా సర్వే చేసి ఇండ్లను రెగ్యులరైజ్​చేయాలి. లేదంటే డాక్యుమెంట్లు లేని మా లాంటి పేదలు నష్టపోతారు.
- మల్లయ్య, ఇంటి ఓనర్, జవహార్​నగర్​మున్సిపల్​ కార్పొరేషన్​