నిత్యామీనన్ యాక్ట్ చేస్తోందంటే ఆ సినిమాపై ప్రత్యేక అంచనాలు ఏర్పడతాయి. ‘స్కైల్యాబ్’ మూవీ విషయంలోనూ అంతే. నిత్య, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో విశ్వక్ ఖండేరావు రూపొందించిన ఈ చిత్రం డిసెంబర్ 4న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిత్య కాసేపు ఇలా ముచ్చటించించారు.
‘స్కైలాబ్ లాంటి కథను ఎవరూ కాదనలేరు. తెలుగు సినిమాకు ఈ సబ్జెక్ట్ కొత్త. తెలంగాణలోని చిన్న గ్రామంలో జరిగిన రియల్ స్టోరీ. ఇంటర్వెల్ వరకు విని ఓకే చెప్పేశాను. అంతగా నచ్చింది. ఓ మంచి సినిమా తీయడం చాలా కష్టం. ఈ సినిమాకి కూడా కొన్ని ఇష్యూస్ వచ్చాయి. దాంతో నేను కూడా ప్రొడక్షన్లో భాగమయ్యాను. అనుకోకుండా ప్రొడ్యూసర్ అయ్యాను. ఇది కూడా మంచి ఎక్స్పీరియెన్స్. ఈ కథ విన్నప్పుడే స్కైల్యాబ్ గురించి నాకు తెలిసింది. ఇంటి కెళ్లి అమ్మవాళ్లను అడిగితే వివరంగా చెప్పారు. ఇది సినిమాగా వస్తే ఫెంటాస్టిక్గా ఉంటుందనిపించింది. పాత జెనరేషన్కి తెలిసిన విషయం ఇప్పటి వాళ్లకీ చెప్పొచ్చనిపించింది. ఆ టైమ్లో గోల్డ్ కాయిన్స్ కూడా మింగేశారని విన్నాను. తిరుపతిలో అయితే అందరూ కొండ కిందకు వెళ్లి దాక్కున్నారట. అలాంటి సీన్స్ అన్నీ ఇందులో పెట్టాం. నేను, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ.. ముగ్గురం లీడ్ రోల్స్ చేసినా మా మధ్య కాంబినేషన్ సీన్స్ లేవు. వాళ్లిద్దరికీ ఉంటాయి. నాది సెపరేట్ ట్రాక్. వాళ్లిద్దరూ సూపర్బ్గా నటించారు. విలేజ్ స్టోరీ అయినా మొత్తం విలేజ్ లుక్లో ఉండదు. చాలా పాలిష్డ్గా.. వెస్టర్న్ క్లాసిక్ మ్యూజిక్ సౌండ్స్తో ఉంటుంది’ అని నిత్యామీనన్ అన్నారు.
‘గౌరమ్మ అనే జర్నలిస్ట్ క్యారెక్టర్నాది. తెలంగాణ యాసలో మాట్లాడాను. డబ్ చేయకుండా లొకేషన్లో సింక్ సౌండ్తోనే డైలాగ్స్ అన్నీ చెప్పేశాను. కరెక్షన్స్ కోసం డబ్బింగ్కి వెళ్దామా అని అడిగితే ఒక్క వాక్యం కూడా మార్చాల్సిన పని లేదన్నారు డైరెక్టర్. చాలా సంతోషమేసింది. తెలంగాణ యాస అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఎంజాయ్ చేస్తూ చెప్పాను. ‘సంతకం ఎట్టిండు’ లాంటి సౌండ్స్ బాగుంటాయి. ‘అలా మొదలైంది’ రిలీజయినప్పుడు రెండు రోజుల వరకు ఆ సినిమా గురించి ఎవరికీ తెలీదు. తర్వాత ఒక్కసారే పికప్ అయ్యింది. ఇది కూడా అలా అవుతుందనే నమ్మకం ఉంది. ప్రొడ్యూస్ చేద్దామనే ఐడియా వచ్చినప్పుడు ముందు రమేష్ ప్రసాద్ గారిని, తర్వాత సి.వి.రెడ్డి గారిని కలిసి కొన్ని ఇన్పుట్స్ తీసుకున్నాను. ప్రొడక్షన్ కాస్ట్ ఎలా తగ్గించాలనే ఆలోచన ఎప్పుడూ ఉంటుంది కదా! కొన్ని సందర్భాల్లో ఈ వ్యవహారాల్లోకి రావడం అవసరమా అనిపించింది. ఎందుకంటే నటనపై ఉన్న ఆసక్తి నిర్మాణం మీద లేదు నాకు. అందుకే డబ్బుల కోసం కాకుండా మంచి సినిమా అనే ఉద్దేశంతోనే ఎంటరయ్యాను. అయినా మరిన్ని సినిమాలు తీస్తాను. చిన్న బడ్జెట్ సినిమాలంటే నాకు ఇష్టం’ అని నిత్య చెప్పారు.
‘ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాను. గమనం, భీమ్లానాయక్ చిత్రాలతో పాటు తమిళంలో ధనుష్తో, మలయాళంలో విజయ్ సేతుపతితో కూడా సినిమాలున్నాయి. అన్నీ బ్యాక్ టు బ్యాక్ రిలీజవుతాయి. హిందీలో ‘బ్రీత్’ వెబ్ సిరీస్ థర్డ్ సీజన్ చేస్తున్నా. అమెజాన్ ప్రైమ్ కోసం ‘కుమారి శ్రీమతి’ అనే సిరీస్ కూడా చేస్తున్నాను. కొత్త డైరెక్టర్వర్క్ చేస్తున్నాడు. రాజమండ్రి అమ్మాయి లైఫ్ చుట్టూ తిరిగే కథ. మరికొన్ని ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా లైన్లో ఉన్నాయి. ‘భీమ్లానాయక్’లో నటించమని త్రివిక్రమ్ నన్ను అడిగారు. లేడీ పవన్ కళ్యాణ్లా సెట్ అవుతానన్నారు. చాలా సంతోషమేసింది. పవన్తో వర్క్ చేయడం హ్యాపీ. ఆయన సెట్లో చాలా కూల్గా ఉంటారు. నేను ప్రొడ్యూసర్గా మారానని చెబితే సర్ప్రైజ్ అయ్యారు. షూటింగ్ అయిపో వచ్చింది. మా కాంబోలో ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉందంతే’ అని నిత్యామీనన్ పేర్కొన్నారు.