
హైదరాబాద్: తన పేరుతో ట్విట్టర్ లో ఫేక్ అకౌంట్ ఏర్పాటు చేశారని తెలిపాడు ప్రముఖ హాస్యనటుడు ఆలీ. పేక్ అకౌంట్ ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం సైబరాబాద్ డీసీపీ రోహిణికి ఫిర్యాదు చేశాడు. ఇప్పటి వరకు తనకు ఎలాంటి ట్విట్టర్ అకౌంట్ లేదని తెలిపాడు. అయితే కొన్ని రోజులుగా ‘యాక్టర్ ఆలీ అఫీషియల్’ పేరుతో అకౌంట్ క్రియేట్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.. పలు పోస్టులు పెడుతున్నారని చెప్పాడు. కొంతమంది హీరోలను పొగుడుతూ పోస్టులు పెట్టినట్లు తెలిపాడు.
ఆ అకౌంట్ లో పెట్టిన వాటిని అధికారిక పోస్టులుగా భావించి మీడియా వార్తలు రాస్తోందని, ఇకపై తనపై ఏ సమాచారం తెలిసినా తన టీం మెంబర్స్తో చర్చించిన తర్వాతే వార్తలు రాయాలని కోరాడు ఆలీ. ప్రస్తుతం వైసీపీలో కీలక సభ్యుడిగా ఉన్నానని, తన వల్ల పార్టీకి, సీఎంకి ఎలాంటి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతోనే.. పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపాడు ఆలీ.