
- 2016లో బెట్టింగ్ యాప్స్ కంపెనీతో ఒప్పందం, ప్రమోషన్: ప్రకాశ్రాజ్
- ఆ సంస్థ నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని వెల్లడి
- ఐదేండ్ల బ్యాంకు స్టేట్మెంట్లు, డిపాజిట్లు ముందు పెట్టి విచారించిన ఈడీ
- ఐదు గంటల పాటు ప్రశ్నల వర్షం
- ఆగస్టు 11న రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ ఎంక్వైరీ
హైదరాబాద్, వెలుగు: బెట్టింగ్ యాప్స్ కంపెనీల నుంచి తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ చెప్పారు. 2016లో ఓ బెట్టింగ్ యాప్ కంపెనీకి ప్రచారం చేశానని, తర్వాత ప్రచారం మానుకున్నాని పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్స్కు ఇకపై ప్రచారం చేయబోనని వెల్లడించారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముందు ప్రకాశ్రాజ్ విచారణకు హాజరయ్యారు. ఈడీ సమన్లలో పేర్కొన్న విధంగా ఉదయం 10 గంటలకు ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. తనతోపాటు లాయర్ను తీసుకొచ్చారు. కానీ విచారణ జరుగుతున్న గదిలోకి ఈడీ అధికారులు లాయర్ను అనుమతించలేదు. జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల ఈడీ బృందం ప్రకాశ్రాజ్ను విచారించింది. 5 గంటల పాటు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.
దుబాయ్ నుంచి బెట్టింగ్ యాప్ ఆపరేషన్స్
ప్రకాశ్రాజ్ ప్రధానంగా దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తున్న ఓ బెట్టింగ్ యాప్ కంపెనీతో 2016 లో అగ్రిమెంట్ చేసుకున్నానని ఈడీకి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను అందించారు. అగ్రిమెంట్ ప్రకారం బెట్టింగ్ యాప్ కంపెనీ నుంచి తాను ఎలాంటి డబ్బు తీసుకోలేదని ప్రకాశ్రాజ్ చెప్పినప్పటికీ.. సదరు కంపెనీ నుంచి ఆయనకు డబ్బు అందినట్లు ఈడీ ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. ఈ మేరకు గత ఐదేండ్ల బ్యాంక్ ట్రాన్సాక్షన్లను ఆయన ముందుంచి ప్రశ్నించినట్లు సమాచారం. పాన్ కార్డ్ ఆధారంగా ప్రకాశ్రాజ్ బ్యాంక్ అకౌంట్లలో గుర్తించిన డిపాజిట్లపైనా ఆరా తీసినట్లు తెలిసింది. కాగా, 2017లో మరోసారి ఒప్పందం పొడిగిస్తామని బెట్టింగ్ యాప్ సంస్థ కోరగా అందుకు అంగీకరించలేదని ప్రకాశ్ రాజ్ చెప్పినట్లు సమాచారం. అయినప్పటికీ గతంలో యాడ్ చేసిన ప్రమోషన్లను 2021లో మరో కంపెనీ నిర్వాహకులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ప్రకాశ్రాజ్ ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్లో వెల్లడించారు. కాగా, ఆగస్టు 11న రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ,13న మంచు లక్ష్మిని విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఈడీ సమన్లు జారీ చేసింది.