హైదరాబాద్, వెలుగు: పీఆర్సీపై సలహాలు, సూచనలు ఇవ్వాలని ఉద్యోగులు, అసోసియేషన్లు, పెన్షనర్లు, లోకల్ బాడీల ఉద్యోగ సంఘాలను పీఆర్సీ కమిషన్ కోరింది. వచ్చే నెల 4 వరకు తమ సూచనలు, సలహాలను పోస్ట్, ఈ మెయిల్ లో పంపవచ్చని లేదా పీఆర్సీ కమిషన్ కు నేరుగా అందజేయవచ్చని శనివారం ఓ ప్రకటనలో కమిషన్ తెలిపింది. సెక్రటేరియెట్ దగ్గర బీఆర్ కే భవన్ లోని 8వ ఫ్లోర్ లో పీఆర్సీ కమిషన్ ఆఫీస్ ఉందని పేర్కొంది. TSPRC.02.2023@GMAIL.COM మెయిల్ ఐడీకి పంపాలని సూచించింది.
రాష్ట్రంలో రెండో పీఆర్సీ ఇవ్వడానికి ఆర్థిక శాఖ మాజీ సెక్రటరీ శివశంకర్ చైర్మన్గా, రిటైర్డ్ ఐఏఎస్ బి.రామయ్య మెంబర్గా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుడు అక్టోబర్ 2న పీఆర్సీ కమిషన్ ను ఏర్పాటు చేసింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2023 జులై 1 నుంచి పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది. గత పీఆర్సీ గడువు ముగిసినందున 5% ఐఆర్ను ప్రకటించి పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేశారు. 6 నెలల్లో పీఆర్సీ కమిషన్ రిపోర్టు ఇవ్వాలని గత ప్రభుత్వం మౌఖికంగా ఆదేశించిందని, ఈ గడువు వచ్చే నెల 31తో ముగియనుందని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.