కూకట్​పల్లి అంకుర హాస్పిటల్‌లో .. డెలివరీకి వచ్చిన నిండు గర్భిణి మృతి

కూకట్​పల్లి అంకుర హాస్పిటల్‌లో .. డెలివరీకి వచ్చిన నిండు గర్భిణి మృతి
  • డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన  

కూకట్​పల్లి, వెలుగు: డెలివరీ కోసం ఆసుపత్రిలో చేర్చిన అరగంట వ్యవధిలోనే నిండు గర్భిణి మృతి చెందింది. ఈ ఘటన కూకట్​పల్లి అంకుర ఆసుపత్రిలో జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ చనిపోయిందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. ఆసుపత్రిలోని రిసెప్షెన్​లో బైఠాయించి నిరసన తెలిపారు. మేడ్చల్​జిల్లా గండిమైసమ్మ మండలం మల్లంపేటలో ఉండే సింధుజ(32), తిరుపతి భార్యాభర్తలు. తిరుపతి ఐటీ జాబ్​చేస్తున్నాడు. నిండు గర్భిణి అయిన సింధుజకు శనివారం ఉదయం పురిటి నొప్పులు రావటంతో తిరుపతి కూకట్​పల్లి సుమిత్రానగర్ అంకుర ఆసుపత్రికి తీసుకువచ్చాడు.

 కాగా, అడ్మిట్​చేసిన అరగంట వ్యవధిలోనే సింధుజ మృతి చెందిందని డాక్టర్లు చెప్పటంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. డాక్టర్లు ఒకసారి హార్ట్​ఎటాక్​ వచ్చిందని, మరోసారి బీపీ పెరిగి మృతి చెందిందని పొంతన లేని సమాధానం చెప్పటంతో మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో బైఠాయించి నిరసన తెలిపారు. డాక్టర్లు, ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఆసుపత్రి ప్రతినిధి శివ మాట్లాడుతూ.. సింధుజను ఎమర్జెన్సీ కండిషన్​లో ఆసుపత్రిలో చేర్పించారన్నారు. 

చికిత్స అందిస్తున్న టైంలో హైబీపీ వచ్చిందని, ఇంకుబేషన్​చేసే క్రమంలో ఆమె మృతి చెందిందని తెలిపారు.  సింధుజ గతంలో ఎప్పుడూ తమ ఆసుపత్రిలో చికిత్స తీసుకోలేదని చెప్పారు. అయితే తన భార్యకు మొదటి నుంచి అంకుర ఆసుపత్రిలోనే చికిత్స చేయించానని, కేపీహెచ్​బీ కాలనీ బ్రాంచ్​తో పాటు సుమిత్రానగర్​బ్రాంచ్​లో గతంలో చికిత్స చేయించానని తిరుపతి మీడియాకు చెప్పాడు.