
- నేడు రాష్ట్రపతి ఎన్నిక
- ఉ. 10 నుంచి సా. 5 దాకా అసెంబ్లీలో పోలింగ్
- రాష్ట్రంలో ఓటు వేయనున్న 120 మంది ఎమ్మెల్యేలు
- రాష్ట్ర ఎంపీలంతా ఓటేసేది పార్లమెంట్లో
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రపతి ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర అసెంబ్లీలోని కమిటీ హాల్ -1లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లో ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలతోపాటు ఏపీలోని ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే ఎం.మహీధర్ రెడ్డి ఇక్కడ ఓటు వేయనున్నారు.
రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో ఎంపీలు (లోక్సభ, రాజ్యసభ), ఎమ్మెల్యేలు ఓటర్లు. ఎంపీలు పార్లమెంట్లో, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రత్యేక పరిస్థితుల్లో ముందస్తు అనుమతి తీసుకుంటే వేరే చోట ఓటు వేసేందుకు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తుంది. ఎవరు, ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకునేది పోలింగ్కు పది రోజుల ముందే ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఈసీ అనుమతితో ఏపీ ఎమ్మెల్యే మహీధర్రెడ్డి ఇక్కడ ఓటు వేయనున్నారు. ఇక రాష్ట్ర ఎంపీలంతా పార్లమెంట్లోనే తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఎంపీలకు గ్రీన్.. ఎమ్మెల్యేలకు పింక్ కలర్ బ్యాలెట్
రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పేపర్లు, బాక్సులు అసెంబ్లీకి చేరుకోగా వాటిని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక్కో అభ్యర్థి తరఫున ముగ్గురు చొప్పున రిప్రజంటేటివ్ (ఏజెంట్ల)లను అనుమతిస్తారు. సోమవారం ఉదయం 9 గంటలకు అభ్యర్థుల రిప్రజంటేటివ్ల సమక్షంలో స్ట్రాంగ్ రూం ఓపెన్ చేస్తారు. ఖాళీ బ్యాలెట్ బాక్సులకు వారి సమక్షంలోనే సీల్ చేసి పోలింగ్ స్టేషన్కు తరలిస్తారు. బ్యాలెట్ పేపర్లను సైతం వారి సమక్షంలోనే ఓపెన్ చేస్తారు. ఎంపీలు ఓటు వేసేందుకు గ్రీన్ కలర్ బ్యాలెట్ పేపర్, ఎమ్మెల్యేలకు పింక్ కలర్ బ్యాలెట్ పేపర్ ఇస్తారు. ఓటర్లు ఎలక్షన్ కమిషన్ అందించే పెన్నుతోనే ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థుల పేరుకు ఎదురుగా ఉన్న గడిలో నంబర్లు (1, 2..) వేయాలి. ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేయకపోతే ఆ ఓటును ఇన్వ్యాలీడ్గా పరిగణిస్తారు. ఓటర్లు తాము ఓటు వేసిన బ్యాలెట్ పేపర్ను అక్కడే ఉన్న ఏజెంట్ లేదా ఇంకెవరికైనా చూపించినా దాన్ని ఇన్వ్యాలీడ్ ఓటుగా పరిగణిస్తారు. పోలింగ్ తర్వాత రిప్రజంటేటివ్ల సమక్షంలో బ్యాలెట్ పేపర్ను సీల్ చేసి ఢిల్లీకి తరలిస్తారు.
తెలంగాణ భవన్లో శిక్షణ
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉదయం 8 గంటలకు తెలంగాణ భవన్కు చేరుకోవాలని పార్టీ ఆదేశించింది. ఓటు ఎలా వేయాలనేదానికిపై మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎలక్షన్ ఎక్స్పర్ట్ శిక్షణ ఇస్తారు. తర్వాత అసెంబ్లీకి బయల్దేరుతారు. షెడ్యూల్ ప్రకారం సీఎం కేసీఆర్ సైతం తెలంగాణ భవన్కు రావాల్సి ఉంది. కానీ ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన, సమీక్షల్లో సీఎం ఆదివారం పొద్దుపోయే వరకు ఏటూరు నాగారంలోనే ఉండిపోయారు. దీంతో ఆయన, ఆయనతో పాటు ఉన్న మంత్రులు నేరుగా అసెంబ్లీకి వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో సిన్హాకే ఎక్కువ ఓట్లు!
ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. రాష్ట్ర అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా టీఆర్ఎస్ నుంచి 103 మంది, మజ్లిస్ పార్టీకి ఏడుగురు, కాంగ్రెస్కు ఆరుగురు, బీజేపీకి ముగ్గురు సభ్యులు ఉన్నారు. బీజేపీ మినహా మిగతా పార్టీలు యశ్వంత్ సిన్హాకే మద్దతు ప్రకటించాయి. ఈనేపథ్యంలో రాష్ట్రంలో పోలయ్యే ఓట్లలో ప్రతిపక్ష అభ్యర్థికే ఎక్కువ పడే ఆస్కారముంది. రాష్ట్రపతి ఎన్నికల్లో విప్ లేకపోవడం, ఎన్డీఏ గిరిజన అభ్యర్థిని పోటీకి దించడంతో క్రాస్ ఓటింగ్కు ఏమైనా అవకాశం ఉందా అనే చర్చ కూడా సాగుతోంది. రాష్ట్రం నుంచి ఒక్క ఓటు కూడా చేజారకుండా చూడాలని ఇప్పటికే ఆయా జిల్లాల మంత్రులకు పార్టీ నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేలు పార్టీ అధినాయకత్వం ఆదేశాలు పాటిస్తారా? లేక ఆత్మప్రబోధం మేరకు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేస్తారా అనే చర్చ సాగుతోంది.