
నికోసియా, కాల్గరీ: యూరప్, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు ఆందోళనకరమని.. ఇది యుద్ధాలు చేసుకునే యుగం కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చర్చలు, ఒప్పందాల ద్వారా మానవత్వానికి చిహ్నమైన శాంతి, స్థిరత్వం సాధించాలని సూచించారు. సైప్రస్ పర్యటనలో ఉన్న మోదీ సోమవారం ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ తో చర్చలు జరిపారు. వాణిజ్యం, ఢిఫెన్స్, గ్రీన్ఎనర్జీ, ఉగ్రవాదం సహా పలు అంశాలపై ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి సైప్రస్ అతున్నత పురస్కారం ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్3’ ను ఆ దేశ ప్రధాని నికోస్ ప్రధానం చేశారు.
సైప్రస్ ప్రజలు, ప్రభుత్వానికి మోదీ థ్యాంక్స్ చెప్పారు. అనంతరం నికోస్తో కలిసి మీడియా సమావేశంలో మోదీ మాట్లాడారు.పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్ అనంతరం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విషయంలో అండగా నిలిచినందుకు నికోస్కు థ్యాంక్స్ చెప్పారు. ఇండియా -సైప్రస్ బాండ్ బలంగా ఉందన్నారు. సైప్రస్ భూభాగాలను టర్కీ ఆక్రమించిన అంశంలో నికోస్కు భారత్ మద్దతుగా నిలుస్తుందని తెలిపారు.
యూరోపియన్ యూనియన్ అధ్యక్ష పదవి సైప్రస్కు రావడంపై అభినందనలు తెలిపారు. ఇది ఈయూతో సంబంధాలు మెరుగు పరుచుకునేందుకు దోహదం చేస్తుందన్నారు. సైప్రస్ ఇండియన్ టూరిస్టులకు హాట్ స్పాట్గా ఉందని డైరెక్ట్ ఫ్లైట్స్ నడిపే ప్లాన్ ఉందన్నారు. ఇక్కడ యోగా, ఆయుర్వేదంకు డిమాండ్ పెరగడంపై సంతోషం వ్యక్తం చేశారు. సైప్రస్ అధ్యక్షుడిని ఇండియా రావాల్సిందిగా ఆహ్వానించారు.
కెనడా వెళ్లనున్న ప్రధాని
సైప్రస్ నుంచి ప్రధాని మోదీ కెనడా బయల్దేరారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు జీ7 సమిట్కు మోదీ హాజరవుతున్నారు. మోదీ జీ7 సమావేశాలకు వెళ్లడం ఇది ఆరో సారి. రష్యా-ఉక్రెయిన్ ఫైట్, ఇరాన్-ఇజ్రాయీల్ టెన్షన్, ఏఐ, ఖాంటం టెక్, ఎనర్జీ సెక్యూరిటీపై ఇందులో చర్చలు జరిగే చాన్స్ ఉంది. గతంలో ఖలిస్తాన్ అంశం వల్ల కొంత ప్రభావితం అయిన ఇండియా-కెనడా రిలేషన్స్.. మార్క్ కార్నీ పదవి చేపట్టిన తర్వాత మెరుగుపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.