
హైదరాబాద్, వెలుగు: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్ లో కోల్కతా థండర్బోల్ట్స్ తొలి విజయం సొంతం చేసుకుంది. మంగళవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కోల్కతా 3–-1 ( 12-–15, 15–-13, 15–-6, 19–-17) సెట్ల తేడాతో కొచ్చి బ్లూ స్పైకర్స్ ను ఓడించింది.
గత మ్యాచ్లో గెలిచిన ఉత్సాహంతో బరిలోకి దిగిన కొచ్చి బ్లూ స్పైకర్స్ మొదటి సెట్ నెగ్గి మరో విజయం సాధించేలా కనిపించింది. అయితే రెండో సెట్ నుంచి కోల్కతా అసలు ఆట మొదలుపెట్టింది. కెప్టెన్ అశ్వల్ రాయ్, పంకజ్ శర్మ పవర్ఫుల్ స్పైక్స్తో చెలరేగారు. డిఫెన్స్ కూడా బలంగా ఉండటంతో వరుసగా మూడు సెట్లు గెలిచిన కోల్కతా లీగ్లో గెలుపు రుచి చూసింది. పంకజ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. మరో మ్యాచ్లో గోవా గార్డియన్స్ 3–2తో అహ్మదాబాద్ డిఫెండర్స్ జట్టును ఓడించింది.