అలంపూర్, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులను ప్రిన్సిపాల్ చితకబాదిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. టెన్త్ విద్యార్థులు సోమవారం పరీక్షలు రాయడానికి వెళ్లారు. అదే సమయంలో స్కూల్లోని కొంత మంది స్టూడెంట్స్ టెన్త్ స్టూడెంట్ల డార్మెటరీలోకి వెళ్లి పెట్టెలను ధ్వంసం చేశారనే కారణంతో ప్రిన్సిపాల్ వారిని రక్తం వచ్చేలా కొట్టాడు.
ఈ విషయమై ప్రిన్సిపాల్ రామకృష్ణను వివరణ కోరగా 7, 8 తరగతుల విద్యార్థులు టెన్త్ స్టూడెంట్ల డార్మెటరీలోకి వెళ్లి వాళ్ల పెట్టెల తాళాలను ధ్వంసం చేశారని చెప్పారు. నోట్ బుక్స్, పుస్తకాలు, డబ్బు దొంగలించడంతో కొట్టినట్టు తెలిపారు.

