విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపల్

విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపల్
  • చర్యలు తీసుకోవాలంటూ స్టూడెంట్ల నిరసన 
  • బెల్లంపల్లిలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా

బెల్లంపల్లి, వెలుగు: ప్రిన్సిపాల్​తమను కొట్టారని, ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి పట్టణంలోని బాలుర రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల స్టూడెంట్లు డిమాండ్ చేశారు. గురువారం తరగతులను బహిష్కరించి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు బైఠాయించారు. సదరు ప్రిన్సిపాల్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకముందు వారంతా స్కూల్ నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల వరకు ర్యాలీగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు. 

తమ తోటి విద్యార్థిని ప్రిన్సిపాల్ శ్రీనివాస్ విచక్షణారహితంగా కొట్టారని ఆయన్ను సస్పెండ్ చేయాలని ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అక్కడ లేకపోయినప్పటికీ దాదాపు మూడు గంటల పాటు బైఠాయించి ఆందోళన చేశారు. విద్యార్థి సంఘాల లీడర్లు అల్లి సాగర్ యాదవ్, నాయిని మురళీ శ్రావణ్, పసులేటి వెంకటేశ్, సబ్బని రాజేంద్ర స్రసాద్ వారికి మద్దతు తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎంఈవో మహేశ్వర్  రెడ్డితోపాటు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎంఈఓ నచ్చజెప్పడంతో విద్యార్థులు తమ నిరసనను విరమించారు.