
అమ్రోహా(యూపీ): పురిటి నొప్పులతో వచ్చిన మహిళకు డెలివరీ చేసిన ప్రైవేట్ డాక్టర్.. కడుపులో టవల్ మరిచిపోయి కుట్లేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లా బన్స్ఖేరీ గ్రామంలో చోటు చేసుకుంది. డెలివరీ తర్వాత కూడా ఆమె తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండటంతో వేరే హాస్పిటల్కెళ్లి పరీక్షించుకోగా లోపల టవల్ ఉన్నట్టు గుర్తించారు. బన్స్ఖేరీకి చెందిన శంషేర్ అలీ, తన భార్య నజ్రానాను డెలివరీ కోసం సైఫీ నర్సింగ్ హోంకు తీసుకొచ్చాడు. డాక్టర్ మత్లూబ్ తన స్టాఫ్తో కలిసి నజ్రానాకు డెలివరీ చేశాడు. కడుపు నొప్పి ఎక్కువ ఉందని నజ్రానా డాక్టర్కు చెప్పింది. చలి కారణంగానే ఇలా అవుతుందని చెప్పి.. మరో ఐదు రోజులు అబ్జర్వేషన్లో ఉంచాడు. తర్వాత ఇంటికి పంపేశాడు. అయినా కడుపు నొప్పి తగ్గకపోవడంతో.. శంషేర్ అలీ తన భార్యను వేరే ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లాడు. అప్పుడు అసలు విషయం బయటికొచ్చింది. కడుపులో చిన్న టవల్ను గుర్తించిన అక్కడి డాక్టర్లు.. మళ్లీ ఆపరేషన్ చేసి దాన్ని తీసేశారు.