జీడిమెట్ల, వెలుగు: ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. పేట్ బషీరాబాద్ పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం... కాంకర్ రోడ్ వేస్ కి చెందిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు (సీజీ19 బీజే 8811) సోమవారం రాత్రి 30 మంది ప్యాసింజర్లతో హైదరాబాద్ నుంచి చత్తీస్ గఢ్ లోని రాయపూర్ కు వెళ్తుంది. నేషనల్ హైవే –44 పై కొంపల్లి చౌరస్తా వద్దకు వెళ్లగానే బస్సులోంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
డ్రైవర్ అప్రమత్తమై బస్సును ఆపేశాడు. ప్రయాణికులు వెంటనే బస్సులోంచి దిగారు. చూస్తుండగానే మంటలు పెరిగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. జీడిమెట్ల అగ్నిమాపక సిబ్బంది వెళ్లి మంటలను ఆర్పారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై స్పష్టత రాలేదు. పోలీసులు కేసు నమోదు చేశారు.