ఉత్తర ప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ ఉత్కంఠతకు తెరపడింది. వారణాసిలో ప్రియాంకా గాంధీ ప్రధాని మోడీ కి వ్యతిరేకంగా పోటీ చేస్తుందని అందరూ అనుకున్నారు. పార్టీ అదిష్టానం ఆదేశిస్తే వారణాసి నుండి పోటీ చేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రియాంకాగాంధీ కూడా స్వయంగా ప్రకటించారు. కాని నామినేషన్ల గడువు దగ్గర పడుతున్న టైంలో… అజయ్ రాయ్ను కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలుపుతూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
అలాగే నాలుగు రోజుల కిందట అన్న రాహుల్ ఆదేశిస్తే.. వారణాసి నుంచి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు ప్రియాంక. దీంతో ఆమె దాదాపు పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ మాత్రం ప్రియాంకను పోటీ చేసే విషయంపై ఆసక్తి చూపలేదు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అజయ్ రాయ్ పేరును ఖరారు చేశారు.
రాహుల్ ప్రస్తుతం రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్లోని అమేథీతో పాటు కేరళలోని వాయనాడ్లో పోటీ చేస్తున్నారు. ఈ రెండు చోట్ల ఆయన గెలిచాక అమేథీని వదలుకుని వాయనాడ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారన్న ప్రచారం ఉంది. అంటే మరో ఆరు నెలల్లో అమేథీలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. అక్కడి నుంచి ప్రియాంకను బరిలో దించే ఉద్దేశంతో ఈ ఎన్నికల్లో పోటీకి నిలపడం లేదని తెలుస్తోంది.