
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో నీట్ యూజీతో పాటు జాతీయ స్థాయి కాంపిటీటివ్ పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. దేశంలో మొత్తం విద్యా వ్యవస్థను మాఫియాకు, అవినీతిపరులకు అప్పగించిందని ఫైర్ అయ్యారు. ‘‘నీట్ యూజీ పేపర్ లీక్ అయింది. నీట్ పోస్ట్ గ్రాడ్యుయేట్, యూజీసీనెట్, సీఎస్ఐఆర్ నెట్ పరీక్షలు ఇప్పటికే రద్దయ్యాయి. ప్రస్తుతం దేశంలో బీజేపీ గవర్నమెంట్లో జాతీయ స్థాయి పరీక్షల తీరు ఇలా ఉంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ను అవినీతిపరులకు, మాఫియాకు అప్పజెప్పింది.
ఎడ్యుకేషన్ సిస్టమ్ను, పిల్లల భవిష్యత్తును అత్యాశపరులకు, మతోన్మాదుల చేతిలో పెట్టారు. బీజేపీ రాజకీయ దురహంకారం వల్లే పేపర్ లీక్లు, పరీక్షల రద్దు జరిగాయి. క్యాంపస్ల నుంచి విద్య మాయమవడం, రాజకీయ గూండాయిజం ఇప్పుడు మన విద్యా వ్యవస్థకు గుర్తింపుగా మారాయి. యువత భవిష్యత్తుకు బీజేపీ ప్రభుత్వం అడ్డంకిగా మారింది. దేశంలోని సమర్థులైన యువత తమ విలువైన సమయాన్ని, శక్తిని బీజేపీ అవినీతిపై పోరాడేందుకు వృథా చేస్తున్నారు. మోదీ కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు”అని ప్రియాంక మండిపడ్డారు.