
న్యూఢిల్లీ: ప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్) తొలి సీజన్ కిరాక్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయంతో అదరగొట్టింది. శుక్రవారం మ్యాచ్లో హైదరాబాద్ 18-–10తో లూధియాన లయన్స్ను ఓడించి లీగ్లో నాలుగో విక్టరీతో 75 పాయింట్లతో టాప్ ప్లేస్కు దూసుకెళ్లింది. అండర్ కార్డ్ మ్యాచుల్లో కిరాక్ హైదరాబాద్ ఆర్మ్ రెజ్లర్లు క్లీన్స్వీప్ చేసి జట్టుకు 3-–0 తో ఆధిక్యం కట్టబెట్టారు. మెయిన్ కార్డ్ మెన్స్ 70 కేజీల్లో సత్నాం సింగ్ 0–-10తో తొలి మ్యాచ్లో నిరాశపరిచాడు. కానీ అండర్ కార్డ్ మ్యాచ్లో గెలిచిన కేఎన్ మధుర విమెన్స్ 65 కేజీల్లో 10–0తో అపర్ణ రోషిత్ను చిత్తు చేసి జట్టును రేసులోకి తెచ్చింది. చివరి పోరులో జగదీశ్ బారు (మెన్స్ 100 కేజీ) 5-–0తో సచిన్ బడోరియపై నెగ్గడంతో హైదరాబాద్ గెలిచింది.