గ్రీన్ ఫీల్డ్ ఎక్స్​ప్రెస్ నేషనల్ హైవేకు తప్పని ఆటంకాలు

గ్రీన్ ఫీల్డ్ ఎక్స్​ప్రెస్ నేషనల్ హైవేకు తప్పని ఆటంకాలు
  • మంచిర్యాల నుంచి వరంగల్ వరకు 112 కిలో మీటర్ల నిర్మాణం
  • ఏడాదిగా అధికారుల ప్రయత్నాలు
  • భూములు ఇవ్వబోమంటున్న రైతులు
  • పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం  

పెద్దపల్లి, వెలుగు: గ్రీన్ ఫీల్డ్ ఎక్స్​ప్రెస్ నేషనల్ హైవేకు ఆటంకాలు తప్పడం లేదు. కేంద్రం ప్రెస్టేజ్ గా నిర్మించతలపెట్టిన ఈ నేషనల్ హైవేకు 31 జులై 2015లో భారత్​మాల పరియోజన స్కీం ద్వారా శ్రీకారం చుట్టారు. తెలంగాణలో మంచిర్యాల జిల్లా నుంచి మంథని మీదుగా వరంగల్ జిల్లా వరకు కొత్తగా రోడ్డు నిర్మించతలపెట్టారు. 112 కిలో మీటర్ల పరిధిలో నిర్మించనున్న రోడ్డులో 2 ఫ్లై ఓవర్లు, 11 అండర్ పాస్​లు నిర్మించనున్నారు. రోడ్డుకు సంబంధించిన డీపీఆర్ రూ.7,612 కోట్లతో రూపొందించారు. ఇటీవల ఎన్ హెచ్ఏఐ ఆఫీసర్లు సర్వే చేసి రోడ్డు నిర్మాణానికి రూ.10,573 కోట్లతో డీపీఆర్ రూపొందించారు. పెరిగిన నిర్మాణ వ్యయాలు, భూముల ధరలకు అనుగుణంగా డీపీఆర్ పెంచాల్సి వచ్చిందని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి విజయవాడ వరకు నిర్మించే రోడ్డుకు దీన్ని లింక్​చేయనున్నారు. అయితే ఈ రోడ్డు కోసం ఏడాది కాలంగా భూసేకరణ జరుగుతోంది. 

ప్రభుత్వ తీరుతోనే..

తెలంగాణ ప్రభుత్వం భూ సేకరణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తోంది. మంచిర్యాల నుంచి వరంగల్, ఖమ్మం మీదుగా విజయవాడ వరకు 310 కిలోమీటర్ల రోడ్డు నిర్మిస్తున్నారు. అలాగే మంచిర్యాల నుంచి మంథని, వరంగల్ వరకు 110 కిలో మీటర్ల నిర్మాణం జరుగనుంది. దీనికి 4,350 ఎకరాల భూమి అవసరముంది.  మంచిర్యాల నుంచి వరంగల్ వరకు 1,767 ఎకరాలు కావాలి. అయితే రైతులతో ఎలాంటి సంప్రదింపులు జరుపకుండా భూసేకరణ చేస్తున్నారు. దీన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భూసేకరణ చట్టం ప్రకారం 1000 ఎకరాలు దాటితే పబ్లిక్ హియరింగ్ జరిపి 2013 చట్ట పరిధిలోనే భూసేకరణ చేయాలి. కానీ అధికారులు మాత్రం ఒకే ప్రదేశంలో 1000 ఎకరాలు సేకరించినప్పుడే పబ్లిక్ హియరింగ్ అవసరమని, మూడు జిల్లాల పరిధిలో 1,767 ఎకరాలు అవసరం ఉంటుంది కాబట్టి పబ్లిక్​ హియరింగ్​తో పాటు 2013 భూసేకరణ చట్టం అవసరం లేదనే వాదనను రైతుల ముందు వినిపిస్తున్నట్లు సమాచారం. దానికి రైతులు ఒప్పుకోవడం లేదు. దీంతో భూసేకరణ ప్రక్రియ అధికారులకు కత్తి మీద సాముగా మారిపోయింది.పెద్దపల్లి జిల్లా అధికారులు రైతులతో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ లబ్ధి చేకూరుస్తామని చెప్పకపోవడంతో రైతులు ససేమిరా అంటున్నారు. దీంతో రోడ్డు నిర్మాణ పనులు మరింత ఆలస్యం అవుతున్నాయి.

హైవే పూర్తయితే డిస్టెన్స్ తగ్గుతుంది..

మంచిర్యాల నుంచి వరంగల్ వెళ్లడానికి వయా గోదావరిఖని, కరీంనగర్, హుజూరాబాద్ మీదుగా 160 కిలో మీటర్లు వెళ్లాలి. కొత్త హైవే పూర్తయితే దాదాపు 60 కిలో మీటర్లు డిస్టెన్స్ తగ్గుతుంది. చాలా ఈజీగా వన్​వేలో వెళ్లొచ్చు. అలాగే జమ్మికుంట, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాలకు చాలా తక్కువ సమయంలో చేరుకోవచ్చు. . ఈ రోడ్ సైడ్ చిన్న పరిశ్రమలు ఏర్పాటు కావడంతోపాటు భూముల ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల పరిధిలో నేషనల్ హైవేలు లేకపోవడంతో ఆయా జిల్లాల్లో ఉన్న ఎఫెక్టెడ్ ఏరియాలు డెవలప్ కాలేదనే వాదనలు ఉన్నాయి. 

భూములిస్తే రోడ్డు పాలైతం

నేషనల్ హైవే కింద మా భూములు తీసుకుంటామని సర్కార్ చెబుతోంది. రైతులతో ఎలాంటి చర్చలు లేకుండా భూములు తీసుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. భూములిచ్చి మేమంతా రోడ్ల పాలు అవుతాం. ఏడాదికి రెండు పంటలు పండే భూములను ఇచ్చి మేము ఎట్లా బతుకుడు. సర్కార్ న్యాయం చేస్తదనే నమ్మకం లేదు.

- నూనేటి కృష్ణ, ముత్తారం, పెద్దపల్లి జిల్లా

ఫోర్​లైన్స్​వే..

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్, రసూల్​పురా, కుందారం, కిష్టాపూర్, వేలాల, గోపాలపూర్ గోదావరి నది మీద నుంచి పెద్దపల్లి జిల్లాలో ఎంటర్ అయి మంథని మండలంలోని పోతారం, విలోచవరం, మల్లెపల్లి, పుట్టపాక, రామగిరి మండలంలోని ఆదివారం పేట, బేగంపేట, లక్కారం, ముత్తారం మండలంలోని మచ్చుపేట, కేశనపల్లి, అడవి శ్రీరాంపూర్, ఓడెడు, మానేరు నది మీదుగా ఉమ్మడి వరంగల్ జిల్లా చిట్యాల, గిద్దె ముత్తారం, అంకుశాపూర్, వెంకటపూర్, పసరకొండ, గూరెప్పాడ్, ఆరెపల్లి ద్వారా వరంగల్ వరకు ఫోర్​లైన్స్​ వే నిర్మించనున్నారు. దీంతో ప్రజలకు దూరభారం తగ్గటంతో పాటు రవాణ సౌకర్యాలు మెరుగవుతాయి.