
పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్కు సిద్ధంగా ఉన్న సమయంలో థియేటర్లు మూసేస్తామని అనడం దుస్సాహసం అని టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు. ఆ దుస్సాహసానికి ముందడుగు వేయకూడదని ఆయన హెచ్చరించారు. టాలీవుడ్ నుంచి ఎవరు ఏది అడిగినా సాయపడుతున్న మనిషి పవన్ కల్యాణ్ అని ఆయన చెప్పారు. టాలీవుడ్లో నెలకొన్న సింగిల్ స్క్రీన్ల థియేటర్ల వివాదంపై అల్లు అరవింద్ ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. ఆ నలుగురు అనే పదాన్ని నెగెటివ్గా రాస్తున్నారని, ఆ నలుగురికీ, తనకూ ఎలాంటి సంబంధం లేదని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. ఆ నలుగురిలో తాను లేనని, ఆ నలుగురు కాస్తా ఇప్పుడు పది మంది అయ్యారని.. చాలా ఏళ్ల నుంచి ఇది నడుస్తోందని అల్లు అరవింద్ వ్యాఖ్యానించడం గమనార్హం.
తెలుగు చిత్ర పరిశ్రమ తీరుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ, సినీ పరిశ్రమ సానుకూలంగా స్పందించడం లేదని, కనీస కృతజ్ఞత చూపించడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం సినీ రంగం కోసం అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ, థియేటర్ల బంద్ వంటి నిర్ణయాలు పరిశ్రమ, ప్రభుత్వం మధ్య గ్యాప్ను పెంచుతున్నాయని చెబుతూ ఓ నోట్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలని చూస్తుంటే.. సినీ రంగంలో ఉన్నవారు మాత్రం ఏపీ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత చూపించడం లేదని, ఎన్.డి.ఏ. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒకసారి కూడా కలవలేదని పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ALSO READ | ఆ నలుగురిలో నేను లేను.. ఆ నలుగురితో నాకు సంబంధం లేదు: అల్లు అరవింద్
సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చేందుకు తాను ఆలోచిస్తుంటే.. తెలుగు సినిమాకి చెందిన కొందరు తనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారని, దానిని తగిన విధంగానే స్వీకరిస్తానంటూ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదని, సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తానని, ఆ విజ్ఞాపనలను సంబంధిత విభాగాలకు పంపిస్తానని ఆయన చెప్పారు. ఆయన హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో ఎగ్జిబిటర్లు థియేటర్ల బంద్ చేయాలని నిర్ణయించడం ఆయనను తీవ్ర అసంతృప్తికి గురిచేసినట్టు తెలుస్తోంది. దీనిని పవన్ కల్యాణ్ ‘రిటర్న్ గిఫ్ట్’గా అభివర్ణించారు.