నిర్మాత, రచయిత వి. మహేశ్ (85) శనివారం రాత్రి గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. ‘మాతృ మూర్తి’ చిత్రంతో 1975 లో వి మహేశ్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. సీనియర్ ఎన్టీఆర్ హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ‘మనుషులంతా ఒక్కటే’ (1976) చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించడమే కాకుండా దానికి మూలకథను కూడా ఆయన అందించారు. ఆ చిత్రానికిగానూ ఆయన ఉత్తమ కథా రచయితగా నంది అవార్డును అందుకున్నారు.
ఆ తర్వాత చిరంజీవి, కోడి రామకృష్ణ కాంబినేష న్లో ‘సింహపురి సింహాం’ (1983), సుమన్, బోయిన సుబ్బారావు కాంబినేషన్లో ‘ముసుగు దొంగ’ (1985) లాంటి పలు చిత్రాలను నిర్మించా రు. అలాగే శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రసార మైన ‘హరి భక్త కథలు’ ధారావాహికకు ఆయనే నిర్మాత, రచయిత. ఆయన స్వగ్రామం నెల్లూరు జిల్లా కోరుతురు. అవివాహితుడైన వి. మహేశ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు చెన్నైలో జరగనున్నాయి.