
‘పరదా’ కథ చాలా కొత్తగా ఉండబోతోందని, ఇందులోని ప్రతి సీన్, క్యారెక్టర్కు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని నిర్మాత విజయ్ డొంకాడ అన్నారు. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్లో ప్రవీణ్ కండ్రేగుల రూపొందించిన ఈ మూవీ ఆగస్టు 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత విజయ్ ఇలా ముచ్చటించారు..
‘ఇదొక ఫిక్షనల్ స్టోరీ. పరదా కల్చర్ని ఫాలో అవుతున్న ఓ అమ్మాయికి ఊర్లో ఒక సమస్య వస్తుంది. ఆ సమస్యకి ఆమె పరిష్కారం ఎలా వెతుక్కుంది అనేది కథ. దీనికి అనుపమ పర్ఫెక్ట్ యాప్ట్ అనుకున్నాం. ఆమె స్టోరీ వినగానే చాలా కనెక్ట్ అయ్యారు. ఫస్ట్ కాపీ చూసి తన కెరీర్లోనే ఇది బెస్ట్ సినిమా అవుతుందని చాలా ఎమోషనల్ అయ్యారు. చాలా ఓన్ చేసుకొని ప్రమోషన్స్ చేశారు. అలాగే దర్శన రాజేంద్రన్, సంగీత గారి పాత్రలు కూడా అద్భుతంగా ఉంటాయి. మృదుల్ సినిమాటోగ్రఫీ, గోపీ సుందర్ అందించిన మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తాయి. డైరెక్టర్ ప్రవీణ్ నాకు ‘సినిమా బండి’ నుంచి తెలుసు. మేమిద్దరం కలిసి దుల్కర్ సల్మాన్తో సినిమా ప్లాన్ చేశాం. కానీ కొన్ని కారణాల వలన అది కుదరలేదు. ఆ తర్వాత ఈ ఐడియా చెప్పారు. తెలుగులో చాలా కొత్త అటెంప్ట్గా ఉంటూనే మా బ్యానర్కు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. మలయాళంలో ఈ చిత్రాన్ని దుల్కర్ రిలీజ్ చేయడం హ్యాపీ’ అని చెప్పారు.