ఖైరతాబాద్,వెలుగు: బీఆర్ అంబేద్కర్ పోరాటాలతోనే రాజ్యాంగంలో దళితులకు హక్కులు, న్యాయం దక్కాయని ప్రొఫెసర్ హరగోపాల్ పేర్కొన్నారు. ఆయన లేకుంటే రాజ్యాంగం ఉండేది కాదని ఆయన అన్నారు. ఆలిండియా ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల సమస్యలపై జాతీయ సదస్సు జరిగింది.
ముఖ్య అతిథిగా హాజరైన హరగోపాల్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వస్తే ప్రజలకు వచ్చినట్టు కాదన్నారు. ప్రతి విషయంలోనూ మహిళలు ముందుకు వచ్చి పోరాడాలని సూచించారు. విద్యతోనే అంబేద్కర్ఉన్నతస్థాయికి ఎదిగారని, అందుకే ప్రతి ఒక్కరూ విద్యా అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అందరూ ఐక్యంగా ఉంటేనే హక్కులను సాధించుకోగలమని పేర్కొన్నారు. సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎర్మాల శివరాజ్ అధ్యక్షతన జరిగిన సదస్సులో పలు సంఘాల నేతలు పాల్గొని మాట్లాడారు.
