నిర్మల్ కోటలను కాపాడుకోవాలి: హిస్టరీ బోర్డ్ చైర్‌‌పర్సన్ ఇందిర

నిర్మల్ కోటలను కాపాడుకోవాలి:   హిస్టరీ బోర్డ్ చైర్‌‌పర్సన్ ఇందిర

నిర్మల్, వెలుగు:  నిర్మల్ లోని చారిత్రక కోటలు, బురుజులను సంరక్షించి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా  ప్రకటించాలని ఉస్మానియా యూనివర్సిటీ హిస్టరీ బోర్డ్ చైర్​ పర్సన్​ ప్రొఫెసర్ ఇందిర కోరారు. ఆదివారం ఆమె నిర్మల్ లోని శ్యామ్ ఘడ్, బౌద్ధ విహార్ తదితర చారిత్రక ప్రాంతాలను ప్రముఖ చరిత్ర కారుడు, అసిస్టెంట్  ప్రొఫెసర్ కటకం మురళితో కలిసి సందర్శించారు.  ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఇందిర మాట్లాడుతూ.. 18వ శతాబ్దంలో నిర్మల్ లో అనేక కోటలు, బురుజులు నిర్మించారని, ఇక్కడి  ఇనుముతో దేశ వ్యాప్తంగా ఫిరంగులు తయారు చేసేవారన్నారు. 

ఇక్కడి మట్టి గొప్పతనం ఎంతో ఉందన్నారు. ఈ  ప్రాంతంలోని  చారిత్రక కట్టడాలన్నింటినీ పూర్తిగా రక్షించాల్సిన అవసరం ఉందన్నారు.  ప్రభుత్వం పర్యాటక రంగానికి ఎంతో ప్రాధాన్యతనిస్తున్న కారణంగా నిర్మల్ కోటలను అభివృద్ధి చేయాలన్నారు. కార్యక్రమంలో  భైంసా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్, డాక్టర్ మధు, గంగన్న, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.