నిరంకుశ పాలన అంతం కావాలంటే కాంగ్రెస్ను గెలిపించాలి : కోదండరాం

నిరంకుశ పాలన అంతం కావాలంటే కాంగ్రెస్ను గెలిపించాలి : కోదండరాం

తెలంగాణ రాష్ర్టంలో బీఆర్ఎస్ నిరంకుశ పాలన అంతం కావాలంటే.. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షులు, ప్రొఫెసర్ కోదండరాం ఓటర్లకు పిలుపునిచ్చారు. పదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిరసనను తెలిపేందుకు కూడా అవకాశం కల్పించకుండా.. అణిచివేతకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కోదండరాం మాట్లాడారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం వనరులను కొల్లగొట్టి.. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు. ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల రద్దుతో పాటు ఈ చలాన్ రుసుమును తగ్గించాలని కోరానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున తాను ప్రచారం చేస్తానని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోదండరాం కోరారు.