ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి

ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి
  •  వెంటనే విడుదల చేయాలని బాంబే హైకోర్టు తీర్పు
  • మావోయిస్టులతో సంబంధాలున్నట్టు ప్రాసిక్యూషన్ నిరూపించలేదని స్పష్టీకరణ  
  • మరో ఐదుగురి విడుదలకూ ఆదేశాలు 
  • న్యాయం దక్కింది: సాయిబాబా భార్య వసంత

ముంబై: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో సాయిబాబాతోపాటు మరో ఐదుగురు నిందితులనూ విడుదల చేయాలంటూ మంగళవారం సంచలన తీర్పు చెప్పింది. నిందితులపై అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనందున, వారందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు జస్టిస్ వినయ్ జోషి, జస్టిస్ వాల్మీకి ఎస్ఏ మెనేజెస్ లతో కూడిన డివిజన్ బెంచ్ తేల్చిచెప్పింది. 

దివ్యాంగుడైన సాయిబాబా(54), మరో ఐదుగురికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని నిర్ధారిస్తూ మహారాష్ట్రలోని గడ్చిరోలి సెషన్స్ కోర్టు 2017లో తీర్పు చెప్పింది. సాయిబాబా, ఇతరుల వద్ద మావోయిస్టులకు సంబంధించిన సాహిత్యం దొరికిందని.. దేశానికి వ్యతిరేకంగా యుద్ధం, హింసను రెచ్చగొట్టేందుకు వీరు ప్రయత్నించారని నిర్ధారిస్తూ.. జీవితఖైదు శిక్షను విధించింది. ఈ తీర్పుపై బాంబే హైకోర్టులో సాయిబాబా అప్పీల్ దాఖలు చేయగా.. 2022, అక్టోబర్ 14న హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 

అయితే, ఈ తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. కేసును మళ్లీ విచారించాలని హైకోర్టుకు సూచించింది. ఈ మేరకు విచారణ అనంతరం బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ మంగళవారం తీర్పు చెప్పింది. ఈ కేసులో నిందితులపై కఠినమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం (ఉపా) కింద అభియోగాలు మోపేందుకు ప్రాసిక్యూషన్ కు గతంలో ఇచ్చిన అనుమతిని కూడా కోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టులో అప్పీల్ కు వెళ్తామని, అందుకు వీలుగా తీర్పు అమలుపై ఆరు వారాల పాటు స్టే ఇవ్వాలన్న ప్రాసిక్యూషన్ విజ్ఞప్తినీ తిరస్కరించింది. 

ఈ కేసులో సాయిబాబా 2014లో అరెస్ట్ కాగా, అప్పటి నుంచి నాగపూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆయన, ఇతర నిందితులు వేరే ఇతర కేసుల్లో అరెస్ట్ కాకపోయినట్లయితే వెంటనే విడుదల చేయాలంటూ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. సాయిబాబాను కోర్టు విడుదల చేయడంపై ఆయన భార్య వసంత కుమారి సంతోషం వ్యక్తం చేశారు. పదేండ్ల పోరాటం తర్వాత న్యాయం దక్కిందన్నారు.