
- ఆల్మట్టి నుంచి నాగార్జున సాగర్ వరకు డెడ్ స్టోరేజీలో ప్రాజెక్టులు
- భారీ వర్షాలు, వరదలు వస్తే తప్ప జులైలో నిండని పరిస్థితి
- గత యాసంగిలో నీళ్లు లేక క్రాప్ హాలీడే
- ఇప్పుడు వరి నార్లు పోసుకోవాలా? వద్దా? అని అయోమయంలో రైతులు
మహబూబ్నగర్, వెలుగు: కృష్ణా బేసిన్ అడుగంటింది. వర్షాలు లేక ఈ బేసిన్లోని ఆల్మట్టి డ్యామ్నుంచి నాగార్జున్సాగర్వరకు ప్రాజెక్టులన్నీ డెడ్స్టోరేజీకి చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలు కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోతున్నాయి. వర్షాలు పడకపోతే జులై చివరికల్లా తాగు నీటికి కూడా ఇబ్బందే. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలను బట్టి కాల్వల ద్వారా సాగు నీరిచ్చే లెవల్కు చేరాలంటే జులై, ఆగస్టులో భారీ వర్షాలు పడాలి. రాష్ట్రంలో కృష్ణా ప్రాజెక్టుల మీద ఆధారపడి సుమారు 36 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా వరి ఎక్కువగా సాగవుతున్నది. పోయినేడాది సరిపడా వర్షాలు, వరదలు లేక యాసంగిలో క్రాప్హాలీడే ప్రకటించాల్సి వచ్చింది. ఈసారి జూన్లోనే మంచి వర్షాలు ఉంటాయని అంచనా వేసినప్పటికీ, జులైలోకి అడుగుపెడ్తున్నా సగటు వర్షపాతం నమోదు కాలేదు. దీంతో కాల్వ నీళ్లు వస్తాయో? రావో? తెలియక నార్లు పోసుకోవాలో? వద్దో? తేల్చుకోలేక రైతులంతా అయోమయంలో ఉన్నారు.
ప్రాజెక్టులు నిండాలంటే 654 టీఎంసీలు కావాలి..
కర్నాటక, తెలంగాణలో వర్షాలు లేక కృష్ణా బేసిన్లోని ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని, తుంగభద్ర (టీబీ డ్యామ్), జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. ఏటా జూన్ రెండో వారం నుంచే కృష్ణా, తుంగభద్ర నదుల ద్వారా ఆల్మట్టి, నారాయణపూర్, టీబీ డ్యామ్, ఉజ్జయిని ప్రాజెక్టులకు భారీగా వరద చేరేది. ఈ ప్రాజెక్టులు ఫుల్కెపాసిటికి చేరాక దిగువన తెలంగాణలో ఉన్న జూరాలకు.. అక్కడి నుంచి శ్రీశైలం, సాగర్ వరకు ఇన్ ఫ్లో నమోదయ్యేది. కానీ వర్షాలు, వరదలు లేక ఈ ప్రాజెక్టులన్నీ ప్రస్తుతం డెడ్స్టోరేజీకి చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ నిండడానికి దాదాపు 654.27 టీఎంసీల నీళ్లు కావాల్సి ఉంటుంది. ఇందులో తెలంగాణ ప్రాజెక్టులకు 370.06 టీఎంసీలు, కర్నాటక ప్రాజెక్టులకు 284.21 టీఎంసీలు అవసరం.
ఆందోళనలో రైతులు..
రాష్ర్టంలో పోయినేడాది సరిపడా వర్షాలు కురవలేదు. ప్రధానంగా కృష్ణా బేసిన్లో లోటు వర్షపాతం నమోదు కావడంతో వానాకాలం పంటలను కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్కింద ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో సాగులో ఉన్న వరి పంటలకు వారబందీ పద్ధతిలో కెనాల్స్, లిఫ్టుల ద్వారా నీటిని అందించాల్సి వచ్చింది. ఇక యాసంగిలో బోర్లు ఉన్న రైతులే పొలాలు సాగు చేశారు. ప్రాజెక్టుల కింద ఆయకట్టు ఉన్న రైతులు సాగు చేయలేదు. కెనాల్స్, లిఫ్టుల పరిధిలో యాసంగి సాగుకు క్రాప్ హాలీడే ప్రకటించారు. ఇక ఈ ఏడాది కూడా ఇప్పటి వరకు ప్రాజెక్టులకు వరద రాలేదు. దీంతో వరి సాగు చేయాలనుకునే రైతులు అమోమయంలో పడ్డారు. ఈ ప్రాజెక్టుల కింద 36 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ఇందులో ప్రధానంగా వరి సాగు చేస్తున్నారు. సీజన్ ప్రారంభం కావడంతో వరి నార్లు పోసుకోవాలా? వద్దా? అనే ఆలోచనలో పడ్డారు. వర్షాలు పడతాయా? పడకుంటే పరిస్థితి ఏంటి? ఒక వేళ ప్రాజెక్టులకు వదర వస్తే వానాకాలం పంటలకు సాగునీటిని విడుదల చేస్తారా? లేదా? అనే సందేహాల్లో ఉన్నారు.
తాగునీటికీ ఇబ్బందులు..
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పడిపోతూ వచ్చాయి. ఎండలు కూడా విపరీతంగా కొట్టడంతో ఏప్రిల్లోనే డెడ్ స్టోరేజీకి చేరాయి. దీంతో తాగునీటికి కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో తాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం కర్నాటక సర్కార్ తో మాట్లాడి అక్కడి ప్రాజెక్టు నుంచి మే నెలలో ఒకటిన్నర టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేయించుకుంది. దీంతో తాగునీటికి కొంత ఇబ్బంది తప్పింది. అయితే ఈసారి ప్రాజెక్టులు నిండకుంటే తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.