200ల స్పీడ్లో ఢీకొన్న కారు..ఆ కారులో ప్రముఖ వ్యాపారవేత్త

200ల స్పీడ్లో ఢీకొన్న కారు..ఆ కారులో ప్రముఖ వ్యాపారవేత్త

హర్యానాలోని నూహ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పారిశ్రామికవేత్త మరణించారు. న్యూ ఢిల్లీ, -ముంబై ఎక్స్‌ప్రెస్‌ వేలో రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు.. పెట్రోల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం సమయంలో రోల్స్ రాయిస్ గంటకు 230 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నట్లు తెలిసింది.

ఢిల్లీకి చెందిన వికాస్‌తో పాటు చండీగఢ్‌కు చెందిన దివ్య, తస్బీర్ అనే ముగ్గురు ప్రమాదంలో గాయపడడంతో ఆసుపత్రి పాలయ్యారు. కారు ఢీకొన్న సమయంలో ముగ్గురు రోల్స్ రాయిస్ ఫాంటమ్‌లో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. రోల్స్ రాయిస్‌లో ఉన్నవారిలో ఒకరైన వికాస్ మాలు (కుబేర్ గ్రూప్ యజమాని) గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని నుహ్ ఎస్పీ నరేంద్ర బిజరానియా చెప్పారు. 

ప్రమాదానికి గురైన వ్యక్తి వికాస్ మాలు ప్రముఖ పారిశ్రామికవేత్త అని, కుబేర్ గ్రూప్ చైర్మన్‌గా పని చేస్తున్నారని ఎస్పీ బిజరానియా గుర్తించారు.

అత్యంత వేగంతో రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును ఢిల్లీ, -ముంబై హైవేపై నడుపుతుండగా.. ట్యాంకర్ యు-టర్న్ తీసుకుంటున్న సమయంలో ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ పుటేజీలో స్పష్టంగా కనిపించాయి.

ప్రమాదం జరిగిన సమయంలో వికాస్ మాలూ కారు నడుపుతున్నారా...? లేక మరెవరైనా నడుపుతున్నారా...? అనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

వికాస్ మాలు ఎవరు? 

వికాస్ మాలు.. ఇండియాకు చెందిన ఒక వ్యాపారవేత్త. ఆయన మొదట పొగాకు ఉత్పత్తులతో కుబేర్ గ్రూప్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం... వికాస్ వ్యాపారం 50 దేశాల్లో 45 వెంచర్లను కల్గి ఉంది. నైపుణ్యం కలిగిన వ్యాపార వ్యూహకర్తగా గుర్తింపు పొందాడు. గ్రూప్‌లోని 12 కంపెనీల కార్యకలాపాలను పర్యవేక్షిస్తాడు. ముఖ్యంగా.. అతను ఇటీవల వర్ధమాన్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో డైరెక్టర్ పదవిని చేపట్టాడు.

కుబేర్ గ్రూప్ సంస్థను వికాస్ మాలు తండ్రి మూల్‌చంద్ స్థాపించారు. ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తి అయిన కుబేర్ ఖైనీ ఒక్కటే రూ.16 కోట్లకు పైగా అమ్మకాలను ఆర్జించింది. ఎంటర్‌ప్రైజ్ పాన్ మసాలా, మౌత్ ఫ్రెషనర్లు, అగరబత్తులతో సహా అనేక రకాల ఉత్పత్తులను కూడా అందిస్తోంది. 

వికాస్ మాలు లగ్జరీ లైఫ్ అంటే ఎంతో ఇష్టపడుతాడు. ఆయన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ చూస్తే ఎవరికికైనా ఇట్టే అర్థమవుతుంది. తరచూ ప్రైవేట్ జెట్ ట్రావెల్స్, లగ్జరీ కార్లలో స్నేహితులతో కలిసి ఉల్లాసంగా గడుపుతుంటాడు. బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్ వంటి వారితోనూ ఫ్రెండ్ షిప్ చేస్తూ.. సెల్ఫీలు దిగారు.