న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఉధృతితో చాలా మందిలో అనేక అనుమానాలు నెలకొన్నాయి. కరోనా సోకి తగ్గినోళ్లు వ్యాక్సిన్ వేసుకోవచ్చొ? ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో లాభమెంత? యువతకే ఎందుకు సీరియస్ అవుతోంది? లాంటి ప్రశ్నలు గిర్రును తిరుగుతున్నాయి. ఈ క్రమంలో వాటికి ప్రముఖ డాక్టర్లు సమాధానాలు చెప్పారు. ఆక్సిజన్ పెరగాలంటే ప్రోనింగ్ చేయాల్సిందేనని సూచించారు. బోర్లా పడుకుంటే 6 నుంచి 8 శాతం వరకు ఆక్సిజన్ లెవల్ ఎక్కువవుతుందని చెప్పారు.
డాక్టర్లు, నిపుణులు చెబుతున్న మరికొన్ని సూచనలు:
- ఆక్సిజన్ లెవల్స్ పడిపోయినట్లు అనిపిస్తే వెంటనే ప్రోనింగ్ (బోర్లా పడుకోవడం) చేయాలి. దాని వల్ల ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి.
- ప్రోనింగ్ టెక్నిక్ వైద్యపరంగా ఆమోదించబడింది. బోర్లా పడుకొని కడుపుపై ఒత్తిడి తీసుకురావాలి. ఇలా చేయడం వల్ల శ్వాస తీసుకోవడంలో కలిగే ఇబ్బందులను అధిగమించొచ్చు.
- శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నప్పుడు, ఆక్సిజన్ లెవల్స్ 94 కంటే కిందకు పడిపోయినప్పుడు మాత్రమే ప్రోనింగ్ చేయాలి. కరోనా పేషెంట్లకు ముఖ్యంగా హోం ఐసోలేషన్లో ఉన్నవారికి ఈ టెక్నిక్ బాగా హెల్ప్ అవుతుంది.
ప్రోనింగ్ చేసే విధానం:
- బోర్లా పడుకొని మెడ కింద ఒక దిండును పెట్టుకోవాలి.
- ఛాతీ భాగానికి కింద తొడ పైభాగానికి అమరేలా ఒకటి లేదా రెండు తలగడలను ఉంచాలి.
- పాదాల కింద రెండు పిల్లోలను పెట్టాలి.
- నిద్రించే పొజిషన్లలో మార్పులు చేస్తూ ఉండాలి.
- ఏ పొజిషన్లో అయినా 30 నిమిషాలకు మించి ఉండకూడదు.
- భోజనం చేసిన తర్వాత ఓ గంట వరకు ప్రోనింగ్ చేయకూడదు.
- ఒక రోజులో 16 గంటల పాటు ప్రోనింగ్ చేయొచ్చు.
ప్రోనింగ్ ఎవరు చేయొద్దు:
- ఒకవేళ ఏమైనా గాయలయ్యుంటే, ముఖ్యంగా ఎముకలకు దెబ్బలు తగిలి ఉంటే ప్రోనింగ్కు దూరంగా ఉండటం బెటర్.
- గర్భిణిలు ప్రోనింగ్ చేయకూడదు.
- తీవ్రమైన గుండె నొప్పితో బాధపడుతున్న వారు దీనికి దూరంగా ఉండాలి.
- వెన్నెముక, తొడ భాగాల్లో నొప్పి లేదా గాయాలతో బాధపడుతున్న వారు చేయకూడదు.