బల్దియాకు తగ్గిన ప్రాపర్టీ ట్యాక్స్

బల్దియాకు తగ్గిన ప్రాపర్టీ ట్యాక్స్
  • గతేడాదితో పోలిస్తే రూ.214 కోట్లు తక్కువ
  • బిల్ కలెక్టర్లకు వేరే పనులతో వసూలుపై ఎఫెక్ట్​
  •  స్పెషల్​ స్కీమ్స్ కోసం ఎదురు చూస్తున్న పన్నుదారులు 
  • ఓటీఎస్​ పెట్టాలంటూ ప్రభుత్వాన్ని కోరిన అధికారులు

హైదరాబాద్, వెలుగు : ఈ ఏడాది బల్దియాకు ప్రాపర్టీ ట్యాక్స్​ తగ్గింది. ఏప్రిల్​ నుంచి ప్రతి నెల తగ్గుతూనే వస్తోంది.  ఏప్రిల్​రూ.372 కోట్లు , మే లో రూ.169 కోట్లు, జూన్​లో 78 కోట్లు, జులైలో రూ.74 కోట్లు, ఆగస్టులో రూ.79 కోట్లు, సెప్టెంబర్ లో రూ.62 కోట్లు వస్తే, ఈ నెలలో పూర్తిగా తగ్గిపోయింది.  ఈ నెల 4 వ తేదీ వరకు  రూ.95 లక్షలు మాత్రమే వచ్చింది. ఇలాగైతే  ట్యాక్స్​ వసూలుపై బల్దియా టార్గెట్​ రీచ్​ అయ్యేలా కనిపిస్తలేదు. ట్యాక్స్​ కలెక్ట్​ చేసే బిల్ ​కలెక్టర్లకు ఇతర పనులు అప్పగించడమే ఇందుకు కారణమైంది. మొన్నటి వరకు కరోనా వ్యాక్సినేషన్,  ప్రస్తుతం బతుకమ్మ చీరల పంపిణీ  బాధ్యతలు అప్పగించగా,  వీరు ట్యాక్స్ కలెక్ట్​ చేసేందుకు వీలు కావడంలేదు. గతేడాది కరోనా సమయంలో  ఎక్కువగా వచ్చినప్పటికీ ఈసారి రూ.214 కోట్ల ఆదాయం తగ్గింది. ట్యాక్స్​ పేయర్స్​ కోసం బల్దియా ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తుందని సిటిజన్స్​ కూడా స్కీమ్స్​ కోసం ఎదురు చూస్తున్నారు. లాస్ట్​ ఇయర్​ లాక్​ డౌన్​లో బల్దియా ఆదాయం తగ్గుతుండగా పెంచుకునేందుకు ఆగస్టు నుంచి నవంబర్ ​వరకు వన్​టైమ్, ఎర్లీ బర్డ్ స్కీమ్ లను అమలు చేసింది.  తద్వారా బల్దియాకు వెయ్యి కోట్ల ఆదాయం వచ్చింది. 
మరోసారి ఓటీఎస్ 
ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ రాయితీ అందించే ‘వన్ టైం సెటిల్‌మెంట్’ స్కీమ్ మరోసారి అమలుకు   బల్దియా రెడీ అవుతోంది. గ్రేట​ర్ లో ఆస్తి పన్ను బకాయిలు చాలా వరకు పెండింగ్‌ ఉన్నాయి. అధికారులు ఎన్నిసార్లు చెప్పినా చెల్లించడం లేదు. గతేడాది కరోనా కారణంగా ప్రభుత్వం 2020 మార్చి వరకు పాత బకాయిలపై 90 శాతం వడ్డీ రాయితీ కల్పించింది. ఇందుకు తొలిసారిగా వన్ టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్​ను తెచ్చింది. ఈసారి కూడా బల్దియాకు ప్రాపర్టీ ట్యాక్స్​లు తగ్గడంతో మరోసారి ఓటీఎస్​అమలు చేయాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. ఇటీవల మంత్రి కేటీఆర్​తో జరిగిన మీటింగ్​లో కూడా దీనిపైన చర్చించినట్లు సమాచారం. ఈ నెలాఖరు లేదా వచ్చే నెలలో ఓటీఎస్​ స్కీమ్​ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.