‘గొల్లవాగు ప్రాజెక్ట్ లో దళారులు చేపలు పట్టొద్దు : సంఘం సభ్యులు దాసరి చంద్ర మౌళి,

‘గొల్లవాగు ప్రాజెక్ట్ లో దళారులు చేపలు పట్టొద్దు : సంఘం సభ్యులు దాసరి చంద్ర మౌళి,

జైపూర్(భీమారం), వెలుగు: గొల్లవాగు ప్రాజెక్ట్ లో దళారులు చేపలు పట్టొద్దని మత్య్స పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు దాసరి చంద్ర మౌళి, గోపాల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం భీమారం మండల కేంద్రంలోని వాటర్ ఎక్కి, నిరసన తెలిపారు. సంఘంలోని కొందరు సభ్యులు కమీషన్లు తీసుకొని, ధర్మయ్య అనే దళారితో కుమ్మకై, రూ.33 లక్షలకు అక్రమంగా టెండర్ నిర్వహించారని ఆరోపించారు. దీనివల్ల మిగతా సభ్యులందరం ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ధర్మయ్య గురువారం సాయంత్రం తమ సంఘానికి సంబంధం లేని 60 మందిని తీసుకువచ్చి,  సుమారు రూ.15 లక్షల విలువైన చేపలను వ్యాన్లు, బొలేరో వాహనాల్లో అక్రమంగా తరలించాడని వాపోయారు. టెండర్​నిర్వహణపై గత ఏప్రిల్ 23న ఫిషరీస్ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఫిషరీస్ డిపార్ట్ మెంట్ సిబ్బంది అక్కడికి చేరుకొని, ఏడీ అవినాశ్​తో ఫోన్ లో మాట్లాడారు. ఆయన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు కిందికి వచ్చారు.