- అందరూ పాలు పితికే అమ్ముతున్నరా? : మంత్రి శ్రీనివాస్ గౌడ్
యాదాద్రి, వెలుగు: ‘కల్తీ ఎందులో లేదు? ఒక్క కల్లుపైనే చర్చ ఎందుకు’ అని ప్రొహిబిషన్, ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. యాదాద్రి జిల్లా నందనంలో రూ.7 కోట్లతో ఏర్పాటు చేయనున్న నీరా సెంటర్కు ఆయన శంకుస్థాపన చేశారు. తర్వాత బ్రోచర్ రిలీజ్ చేసి నీరా తాగారు. ముందుగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మాట్లాడుతూ కొందరు క్లోరోఫాం కలుపుతుండడంతో కల్లుపై నమ్మకం తగ్గిందన్నారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ‘రాష్ట్రంలో ఉత్పత్తయ్యే పాలు జంట నగరాల ప్రజల అవసరాలకే సరిపోతాయి. మిగతా పాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నయ్ ? యూరియాతో పాలు తయారు చేస్తున్నారని వార్తలు వింటున్నాం. పాలు అమ్మేటోళ్లు అందరూ పిండుతుంటే చూస్తున్నమా? పసుపులో బియ్యం పిండితో పాటు కెమికల్స్ కలుపుతున్నరు. దీంతోటి క్యాన్సర్ వస్తది. కారంలో చెక్కపొడి..దాల్చిన చెక్కలో దానిమ్మ పండు తొక్కలు కలుపుతున్నారని వింటున్నాం. వీటన్నింటిపై లేని చర్చ ఒక్క కల్లుపైనే ఎందుకు’ అని ప్రశ్నించారు. కుల వృత్తులను ప్రోత్సహించడంతో భాగంగానే నీరా సెంటర్తో పాటు నాలుగు సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. నీరాకు వేదామృతం అని పేరు పెట్టినట్టు చెప్పారు. ఈ సందర్భంగా కూల్డ్రింక్లపై మండిపడ్డారు. పాయిఖానాలు కడిగే థమ్సప్, కోకాకోలా, ఫెస్టిసైడ్స్ కలిపే కూల్డ్రింక్స్ను సినిమా యాక్టర్ చెప్పిండని తాగి, అమృతమైన కల్లును చీప్డ్రింక్గా అవహేళన చేస్తున్నారన్నారు. కల్లుపై నిందలు వేస్తున్నారన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి రూ. 500 కోట్లతో గౌడ భవన్ నిర్మించబోతున్నామని తెలిపారు. చెట్టుపై నుంచి పడి చనిపోయిన వాళ్లకు రైతుబంధు తరహాలో అకౌంట్లో రూ. 5 లక్షలు వేసేట్టు చూస్తామని మంత్రి తెలిపారు. ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ లిక్కర్తయారీ గీత కార్మికులకు శాపమైందన్నారు. కాగా, కార్యక్రమానికి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ హాజరురాలేదు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డితో ఉన్న విభేదాల కారణంగా బూర నర్సయ్య గౌడ్ రాలేదని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, ఎంపీపీ నరాల నిర్మల, జెడ్పీటీసీ సుబ్బూరు బీరుమల్లయ్య, నందనం సర్పంచ్ప్రభాకర్ పాల్గొన్నారు.