బర్మింగ్హామ్: ఇంగ్లండ్తో ఐదో టెస్టు ఇండియా చేతుల్లోకి వచ్చేసింది. వరుసగా మూడో రోజు బౌలింగ్, బ్యాటింగ్లో ఆధిపత్యం చూపెట్టిన బుమ్రాసేన మ్యాచ్పై పట్టు సాధించింది. హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ (4/66) సత్తా చాటడంతో తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ను తొందరగానే ఆలౌట్ చేసి 132 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన టీమిండియా మూడో రోజు, ఆదివారం చివరకు రెండో ఇన్నింగ్స్లో 125/3 స్కోరు చేసింది. ఫిఫ్టీ పూర్తి చేసుకున్న పుజారా (50 బ్యాటింగ్), రిషబ్ పంత్ (30 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఓవరాల్గా 257 రన్స్ ఆధిక్యంలో ఉన్న ఇండియా 400 ప్లస్ టార్గెట్ ఇస్తే గెలుపు అవకాశాలు పుష్కలం. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 84/5తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 284 వద్ద ఆలౌటైంది. జానీ బెయిర్ స్టో (140 బాల్స్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 106) మెరుపు సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. తనకిది వరుసగా మూడో సెంచరీ కావడం విశేషం. ఇండియా బౌలర్లలో సిరాజ్, బుమ్రా (3/68), షమీ (2/78), శార్దూల్ (1/48) రాణించారు.
కోహ్లీ యాక్షన్.. బెయిర్ స్టో రియాక్షన్
రెండో రోజే ఐదు వికెట్లు కోల్పోయి ఆత్మరక్షణలో పడ్డ ఇంగ్లండ్ ఆదివారం తొలి సెషన్లో దూకుడుగా ఆడింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ (25)తో కలిసి బెయిర్ స్టో ఇండియా బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. ఆరంభంలోనే కోహ్లీ కవ్వించడంతో బెయిర్స్టో మరింత రెచ్చిపోయాడు. తొలి 61 బాల్స్లో 13 రన్సే చేసిన జానీ.. కోహ్లీతో గొడవ తర్వాత 79 బాల్స్లోనే 93 రన్స్ కొట్టాడంటే అతను ఎలా చెలరేగాడో చెప్పొచ్చు. స్టోక్స్ ఇచ్చిన క్యాచ్ను డ్రాప్ చేసిన శార్దూల్ తన తర్వాతి ఓవర్లోనే బుమ్రా పట్టిన చక్కటి క్యాచ్తో అతడిని ఔట్ చేశాడు. అయినా జానీ వెనక్కు తగ్గలేదు. బిల్లింగ్స్ (36) సపోర్ట్ ఇవ్వగా.. సిరాజ్, శార్దూల్ను టార్గెట్ చేసి వరుసగా బౌండ్రీలు రాబట్టాడు. . మధ్యలో వర్షం రావడంతో ముందుగానే లంచ్ బ్రేక్ ఇవ్వగా తిరిగొచ్చిన తర్వాత కూడా జానీ దూకుడు కొనసాగించాడు. ఠాకూర్ బౌలింగ్లో కవర్ పాయింట్ మీదుగా బౌండ్రీ కొట్టి 119 బాల్స్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరకు షమీ వేసిన ఫుల్ లెంగ్త్ బాల్ను డ్రైవ్ చేయబోయి స్లిప్లో కోహ్లీకి చిక్కాడు. దాంతో, ఏడో వికెట్కు 92 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. ఆ తర్వాత సిరాజ్ టెయిలెండర్ల పని పట్టాడు. ఓ షార్ట్ బాల్తో బ్రాడ్ (1)ను కీపర్ క్యాచ్తో వెనక్కిపంపిన అతను కాసేపటికే బిల్లింగ్స్ను క్లీన్బౌల్డ్ చేశాడు. మూడు బౌండ్రీలు, ఓ సిక్స్తో చివర్లో వేగంగా ఆడిన మాటీ పాట్స్ (19)ను ఆఖరి వికెట్గా వెనక్కు పంపాడు.
పుజారా నిలకడ
132 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలినా.. సీనియర్ బ్యాటర్ పుజారా ఓపిగ్గా క్రీజులో నిలిచి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఇన్నింగ్స్ మూడో బాల్కే ఓపెనర్ శుభ్మన్ గిల్ (4)ను అండర్సన్ (1/26) ఔట్ చేయగా.. బ్రాడ్ (1/38)వేసిన వైడ్ బాల్ను వెంటాడిన విహారి (11) బెయిర్స్టోకు చిక్కాడు. ఈ దశలో పుజారాకు తోడైన కోహ్లీ (20) వెంటవెంటనే మూడు ఫోర్లు కొట్టి ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేశాడు. కానీ, కెప్టెన్ స్టోక్స్ (1/22).. ఎక్స్ ట్రా బౌన్స్తో వేసిన లెంగ్త్ బాల్కు కోహ్లీ వికెట్ ఇచ్చుకున్నాడు. తొలుత కీపర్ బిల్లింగ్ క్యాచ్ డ్రాప్ చేసినా పక్కనే ఉన్న రూట్ బాల్ను అందుకోవడంతో ఇండియా 75/3తో కాస్త డిఫెన్స్లో పడింది. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన పుజారాకు తొలి ఇన్నింగ్స్ హీరో పంత్ తోడయ్యాడు. తనదైన స్టయిల్లో పంత్ స్పీడ్గా ఆడగా.. పుజారా మాత్రం చాలా ప్రశాంతంగా బ్యాటింగ్ చేశాడు. చాలా బాల్స్ను వదిలేశాడు. కొన్ని బాల్స్ అతని బాడీకి తగిలాయి. బ్రాడ్ వేసిన ఓ రైజింగ్ బాల్ అతని కుడి చేయి చూపుడు వేలికి తగిలి రక్తం వచ్చింది. ఫిజియో వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత పుజారా పోరాటం కొనసాగించాడు. ఈ క్రమంలో ఫిఫ్టీ పూర్తి చేసుకొని రోజు ముగించాడు.