మొహాలి: కరోనా వైరస్ చాలామంది ప్రాణాలు తీస్తోంది. ఈ పరిస్థితుల్ని అవకాశంగా మలచుకున్న వాళ్లు లాభాలు సాధిస్తున్నారు. డిమాండ్ పెరిగినా లాభం వద్దు, నష్టమైనా ప్రజల మేలే ముఖ్యం అనుకున్నాడు ఆర్.ఎస్. సచ్దేవ్. మొహాలి (పంజాబ్)లో బిజినెస్ చేస్తున్న ఆయన ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లను రీ ఫిల్లింగ్ చేసి ఇస్తున్నాడు. మొహాలిలోని ఇండస్ర్టియల్ ఏరియా, ఫేజ్9లో ఉన్న తన పరిశ్రమ ‘హైటెక్ ఇండస్ర్టీస్ లిమిటెడ్’ దగ్గర సచ్దేవ్ కొన్ని రోజుల నుంచి ఉచితంగా మెడికల్ ఆక్సిజన్ ఇస్తున్నాడు. కొవిడ్తో ఐసోలేషన్లో ఉన్నవాళ్లతోపాటు, ఆస్తమా, క్యాన్సర్, లంగ్ ప్రాబ్లమ్స్, వేరే హెల్త్ ప్రాబ్లమ్స్తో ఐసీయులో ఉన్న వాళ్ల తరపున వచ్చినవాళ్లకు రూపాయి తీసుకోకుండా ఆక్సిజన్ ఇస్తున్నాడు.
ఖాళీ ఆక్సిజన్ సిలిండర్లతో ఆక్సిజన్ తీసుకుపోయేందుకు వందల మంది వస్తున్నారు. స్థానికులే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. డబ్బులు ఇస్తామన్నా ఆక్సిజన్ దొరకని రోజుల్లో ఉచితంగా ఆక్సిజన్ ఇస్తున్న సచ్దేవ్ని అభినందించని వాళ్లు లేరు. ఆక్సిజన్ కోసం వచ్చినవాళ్ల వివరాలు, ఫోన్ నెంబర్లు సేకరించడం కోసం సచ్దేవ్ తన కంపెనీలోని ఉద్యోగుల్ని నియమించాడు. ఆ వివరాలు నమోదు చేసుకునేందుకు (ఆక్సిజన్ తీసుకోవడం కోసం) వచ్చే జనం కూడా ఎక్కువయ్యారు. ఈ ఉచిత ఆక్సిజన్ ఫిల్లింగ్ సెంటర్ దగ్గర గుమిగూడుతున్న జనాన్ని కంట్రోల్ చేసేందుకు పంజాబ్ పోలీసులు సిబ్బందిని నియమించారు.