
- 5 రన్స్ తేడాతో రాయల్స్ ఓటమి
- రాణించిన ప్రభుసిమ్రాన్, ఎల్లిస్
గువాహటి : ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన పంజాబ్ కింగ్స్.. ఐపీఎల్–16లో వరుసగా రెండో విజయం సాధించింది. బ్యాటింగ్లో కెప్టెన్ శిఖర్ ధవన్ (56 బాల్స్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 86 నాటౌట్), ప్రభుసిమ్రాన్ సింగ్ (34 బాల్స్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60) దంచికొడితే, బౌలింగ్లో నాథన్ ఎల్లిస్ (4/30) చెలరేగడంతో.. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో పంజాబ్ 5 రన్స్ తేడాతో రాజస్తాన్పై నెగ్గింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 197/4 స్కోరు చేసింది. తర్వాత రాజస్తాన్ 20 ఓవర్లలో 192/7 స్కోరు మాత్రమే చేసింది. సంజూ శాంసన్ (42), హెట్మయర్ (36), ధ్రువ్ జురెల్ (32 నాటౌట్) పోరాడినా ప్రయోజనం లేకపోయింది. ఎల్లిస్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
ఆరంభం అదుర్స్..
స్టార్టింగ్ నుంచే ధవన్, ప్రభుసిమ్రాన్ పోటీపడి బౌండ్రీలు బాదడంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. 4, 6తో ప్రభుసిమ్రాన్ టచ్లోకి రాగా, థర్డ్ ఓవర్లో ధవన్ రెండు ఫోర్లతో లైన్లో పడ్డాడు. 4వ ఓవర్లో 4, 4, 6, 4తో 19 రన్స్ రాబట్టిన ప్రభు తర్వాత మరో 3 ఫోర్లు కొట్టడంతో పవర్ప్లేలో పంజాబ్ 63/0 స్కోరు చేసింది. 9వ ఓవర్లో రెండో సిక్స్ బాదిన ప్రభు తర్వాతి ఓవర్లో హోల్డర్ (2/29)కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో తొలి వికెట్కు 90 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. మరో రెండు బాల్స్ తర్వాత భానుకా రాజపక్స (1) రిటైర్డ్హర్ట్ అయ్యాడు. ఈ దశలో వచ్చిన జితేశ్ (27), ధవన్కు మంచి సహకారం అందించాడు. 12వ ఓవర్లో ఈ ఇద్దరు 18 రన్స్ రాబట్టారు. తర్వాత మరో రెండు ఫోర్లు బాదిన ధవన్ 36 బాల్స్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వరుస విరామాల్లో 4, 6 బాదిన జితేశ్ 16వ ఓవర్లో చహల్ (1/4)కు వికెట్ ఇచ్చుకున్నాడు. 17వ ఓవర్లో సికందర్ రజా (1)ను అశ్విన్ (1/25) పెవిలియన్కు పంపాడు. ధవన్ మరో రెండు సిక్స్లు, ఓ ఫోర్ కొట్టగా, మధ్యలో షారూక్ ఖాన్ (11) వేగంగా ఆడి ఔటయ్యాడు.
టాప్ ఢమాల్..
ఛేజింగ్లో రాజస్తాన్ టాప్ ఆర్డర్ ఫెయిలైంది. 4 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ (2/47).. యశస్వి జైస్వాల్ (11), అశ్విన్ (0) ఔట్ చేసి షాకిచ్చాడు. తర్వాత ఎల్లిస్ సూపర్ బౌలింగ్తో రాజస్తాన్ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఆరో ఓవర్లో బట్లర్ (19)ను వెనక్కి పంపడంతో రాజస్తాన్ 57/3తో ఎదురీత మొదలుపెట్టింది. తర్వాత కెప్టెన్ శాంసన్, దేవదుత్ పడిక్కల్ (21) ఇన్నింగ్స్ను ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరు నాలుగో వికెట్కు 34 రన్స్ జత చేయడంతో ఇన్నింగ్స్ కాస్త కోలుకుంది. కానీ సెకండ్ స్పెల్కు వచ్చిన ఎల్లిస్.. శాంసన్ను ఔట్ చేయడంతో రియాన్ పరాగ్ (20) క్రీజులోకి వచ్చాడు. పడిక్కల్తో కలిసి ఐదో వికెట్కు 30 రన్స్ జోడించాడు. కానీ 15వ ఓవర్లో ఎల్లిస్ ఆరు బాల్స్ తేడాలో ఈ ఇద్దర్ని ఔట్ చేసి రాజస్తాన్కు ఝలక్ ఇచ్చాడు. చివర్లో హెట్మయర్, ఇంపాక్ట్ ప్లేయర్ ధ్రువ్ జురెల్ ఫోర్లు, సిక్సర్లతో మెరుపులు మెరిపించారు. ఏడో వికెట్కు 26 బాల్స్లోనే 61 రన్స్ జోడించి విజయానికి చేరువగా తీసుకొచ్చారు. కానీ లాస్ట్ ఓవర్లో హెట్మయర్ ఔట్కావడంతో రాజస్తాన్కు ఓటమి తప్పలేదు.
సంక్షిప్త స్కోర్లు
పంజాబ్: 20 ఓవర్లలో 197/4 (ధవన్ 86*, ప్రభుసిమ్రాన్ 60, హోల్డర్ 2/29), రాజస్తాన్: 20 ఓవర్లలో 192/7 (శాంసన్ 42, హెట్మయర్ 36, ఎల్లిస్ 4/30).