కాంగ్రెస్కే సాధ్యమైన సామాజిక న్యాయం

కాంగ్రెస్కే సాధ్యమైన సామాజిక న్యాయం

ప్రభుత్వానికి అతిపెద్ద సంకేతంగా భావించే మంత్రివర్గంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడుగులకు 57శాతం ప్రాతినిధ్యాన్ని కట్టబెట్టి కాంగ్రెస్ మాట ఇస్తే ఖచ్చితంగా చేసి తీరుతుందనే నిజాన్ని మరోసారి రూఢీ చేశారు. ఎస్సీలకు నాలుగు, బీసీలకు మూడు, ఎస్టీలకు ఒక బెర్తును కేటాయించడమే కాకుండా అందులో ఒకరిని ఉప ముఖ్యమంత్రిగా తీసుకొని  అట్టడుగు వర్గాలకు ఎన్నడూ అందని న్యాయాన్ని చరిత్రలో తొలిసారిగా అందించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రను తిరగరాసింది. ప్రపంచానికే ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్  ఆలోచనల్ని నాటినుంచి నేటివరకూ అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో అనుసరిస్తున్న ఏకైక పార్టీ  కేవలం కాంగ్రెస్ మాత్రమే అని సీఎం రేవంత్​ చాటిచెప్పారు. 

కాంగ్రెస్​ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఒక దళితుడు.  అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో ఒక బెర్తును బీసీకి ఇచ్చింది. ఇక మన రాష్ట్ర పీసీసీ రథసారథిగా సమాజంలో వెనుకబడిన వర్గానికి చెందిన మహేశ్ కుమార్ గౌడ్​ను కూర్చోబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి రోల్ మోడల్​గా నిలిపింది. మొన్నటికి మొన్న ప్రకటించిన జంబో కార్యవర్గంలోనూ ఉపాధ్యక్షుల్లో 67 శాతం, ప్రధాన కార్యదర్శుల్లోనూ 68 శాతం బడుగు, బలహీన, దళిత, మైనార్టీ వర్గాలకు ప్రకటించి ప్రభుత్వపరంగా చేసేదానికి, పార్టీపరంగా ఆచరించడానికి కాంగ్రెస్​లో ఒకే విధమైన సిద్ధాంతం అమలౌతుందని తేల్చి చెప్పింది. ఇక ఇటీవల జరిగిన ఎమ్మెల్సీల ఎంపికలో సైతం విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ వంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను మాత్రమే చట్టసభల్లోకి పంపిన విషయం తెలిసిందే. అలాగే నామినేటెడ్ పోస్టుల్లోనూ సింహబాగం ఈ వర్గాలకే దక్కాయి. అధికారానికి అసలు రూపమైన ప్రభుత్వ నియామకాల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన సామాజిక న్యాయం గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేకపోయింది.

బీసీలకు భరోసా!
రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ చట్టం చేసింది. ఈ చట్టాన్ని తమిళనాడు తరహాలో ప్రత్యేకంగా అమలు చేయడానికి  రాష్ట్రపతికి పంపి, కేంద్ర బీజేపీ పెద్దల చిత్తశుద్దికి సవాల్ విసిరింది. విద్య, ఉద్యోగాలతోపాటు చట్టసభల్లో బీసీల గొంతును వినిపించే దిశగా చేసిన ఈ చర్యలు కాంగ్రెస్​కు సమాజం పట్ల గల బాధ్యతను తెలియజేస్తే... ఎలాగైనా  కాంగ్రెస్​ను నిలవరించాలనే లక్ష్యంతోనే బీజేపీ ఆ బిల్లును అడ్డుకుంటున్న విధానాన్ని మనం చూస్తూనే ఉన్నాం.  అయినప్పటికీ బలహీనవర్గాలపై తన ప్రేమను చాటుకోవడానికి  పార్టీ పరంగా రాబోయే ఎన్నికల్లో దాన్ని అమలు చేస్తామని చెప్పారు. బీజేపీ 
కుట్రల్ని పటాపంచలు చేస్తామని  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి సంకల్పించారు.

తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఏకంగా సశాస్త్రీయంగా డెడికేటెడ్ కమిషన్ ద్వారా కులగణనను నిర్వహించి యావత్ బీసీ సమాజం ఆశల్ని సాకారం చేసింది. రాహుల్ గాంధీ మార్గదర్శనానికి అనుగుణంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించిన ఈ కులగణనతో ఢిల్లీ పునాదులు కదిలిపోయాయి. ఆగమేఘాల మీద గత నాలుగేళ్లుగా పెండింగ్​లో ఉన్న జనగణనను నిర్వహించడంతో పాటు అందులో కులగణనను చేస్తామనే ప్రకటనను కేంద్రం మెడలు వంచి ఇప్పిచ్చింది. ఇదీ కాంగ్రెస్ దేశ ప్రజలకు, దేశ బడుగు, బలహీన వర్గాలకు చేసిన గొప్ప మేలు. ఈ నిర్ణయంతో ఇన్నాళ్లు సమాజంలో మేమెంతో మాకంత అని నినదిస్తూ నిరసనలు చేసిన వర్గాలు తమ స్వప్నాన్ని సాకారం చేసుకోబోతున్నాయి.

బడుగులకే భాగస్వామ్యం
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకోసం ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిలోనూ వారి వాటాను అందించే ప్రయత్నం చేస్తోంది.  రైతుభరోసాలో నైనా, సామాజిక పింఛన్లలోనైనా, ఉచిత కరెంటులోనైనా, ఇందిరమ్మ ఇండ్లలోనైనా, ఉచిత ఆర్టీసీ ప్రయాణాల్లోనైనా, ఉచిత సిలిండర్లలోనైనా, ఇలా ఇప్పటివరకూ ప్రజా ప్రభుత్వం అమలు చేసే ప్రతి ప్రజా సంక్షేమ కార్యక్రమంలో అంతరార్థం అంతిమ ప్రయోజనం మా వర్గాలకు సామాజిక న్యాయం అందించడం కోసమే. అందుకే ఏకంగా అట్టడుగు వర్గాలు అత్యధికంగా ఉన్న డ్వాక్రా సంఘాలు, స్వయం సహాయక సంఘాలకే ఆయా ఊర్లలోని కొనుగోలు కేంద్రాలు, మొదలు ఇందిరమ్మ కమిటీలు, బడి కమిటీలు, యువ వికాసాలు ఇలా ప్రతి దాంట్లోనూ వారినే భాగస్వాముల్ని చేస్తున్నది ప్రజా ప్రభుత్వం.

సంక్షేమ హాస్టళ్ళ నిర్వహణతోపాటు మెస్ కొనుగోళ్లు, విద్యార్థులకు యూనిఫాం కుట్లు ఇలా  మా వాటాను సగర్వంగా అందిస్తూ మమ్మల్ని సమాజంలో భాగస్వాములను చేస్తున్నది  ప్రజా ప్రభుత్వం. మా అణగారిన వర్గాలకు చెందిన దళిత బిడ్డ పేరుమీద ఏకంగా సినిమా వర్గాలకు ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రవేశపెట్టి నేడు అందించిన గద్దర్ అవార్డులు మా ఆత్మగౌరవాన్ని మరింత పెంచేవే. ఈ దిశలో తెలంగాణలో ఉదయించే ఈ వెలుగులు యావత్ భారతానికి దిక్సూచులు అవుతాయి. కాంగ్రెస్ ప్రభవించే ఈ సామాజిక న్యాయ చేతనం మా వర్గాల కలల్ని సాకారం చేస్తాయి.

వర్గీకరణ చేసి చూపాం!
నాడు అలీన విధానం మొదలు, ఐఐటీలు, ఇండస్ట్రీలు, వ్యవసాయ విప్లవాలు, అధునాతన దేవాలయాలైన బ్యారేజీలు, డ్యాంలు, మొదలు ఈ దేశాన్ని నేడున్న పటిష్ట స్థితికి చేర్చిన కాంగ్రెస్ పనులు ఎలా ఉంటాయో, ఈ దేశాన్ని ఎంత గొప్పగా తీర్చిదిద్దుతాయో మరోసారి ప్రజల ముందుంచాయి. వివక్షకు గురైన దళిత సమాజం 35 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పట్టువదలని విక్రమార్కుల వలె వారు చేసిన పోరాటానికి ముగింపు పలకటానికి రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన కృషిని 35లక్షల మాదిగలు, 15 లక్షల మాలలు మరిచిపోలేరన్నది అక్షర సత్యం. సుప్రీంకోర్టు తీర్పును అందుకున్న వెంటనే ఎస్సీ వర్గీకరణ కోసం ప్రజా ప్రభుత్వం చేసిన కృషి సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ సందర్భం. కడజాతి కన్నీళ్లు తుడిచే ఈ అకుంటితమైన ప్రయత్నం నిజమైన సామాజిక న్యాయ బావుటా ఎగురవేసిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కిందనటంలో సందేహం లేదు.

జై బాపు, జై భీమ్, జై సంవిదాన్

పున్నా కైలాస్ నేత, టీపీసీసీ, ప్రధాన కార్యదర్శి