ఎంపీ సంజయ్ రౌత్ కామెంట్స్
ముంబై: హిందూత్వ సిద్ధాంతకర్త వినాయక్ దామోదర్ సావర్కర్కు భారత రత్న ఇవ్వొద్దంటున్నవారిని రెండ్రోజులు అండమాన్ సెల్యూలర్ జైలులో పెట్టాలని శివసేన నేత సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వేర్వేరు ఐడియాలజీలు ఉన్నా.. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి శివసేన మహారాష్ట్రలో సర్కారు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. సావర్కర్కు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచీ వ్యతిరేకిస్తోంది. 2019 డిసెంబర్లో రేప్ ఇన్ ఇండియా కామెంట్ చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు. తన పేరు రాహుల్ గాంధీ అని.. రాహుల్ సావర్కర్ కాదని కామెంట్ చేశారు. రౌత్ వ్యాఖ్యలపై యువసేన ప్రెసిడెంట్, మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాక్రే స్పందించారు. గతంలోకి వెళ్లాల్సిన అవసరం లేదని, సంజయ్ రౌత్ ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదన్నారు. మహారాష్ట్ర వికాస్ అఘాది(ఎంవీఏ) ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తోందని ఆదిత్య థాక్రే చెప్పారు. కాంగ్రెస్, శివసేన మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. వేర్వేరు ఐడియాలజీలు ఉన్నా.. దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయన్నా్రు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అందరూ భారత రత్నాలేనని చెప్పారు. భారత రత్న అవార్డు ఇచ్చే అధికారం తమకు లేదని.. కేంద్రంలోని బీజేపీ సర్కారు చేతుల్లో ఉందన్నారు.
రౌత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపాటు
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆంగ్లేయులకు ఎన్నడూ క్షమాపణలు చెప్పని స్వాతంత్ర్య పోరాట యోధుల త్యాగాలు అర్థం కావాలంటే హిందుత్వ ఐడియాలజీకి మద్దతిచ్చేవారు అండమాన్లోని సల్యులర్ జైలును సందర్శించాలని సూచించింది. అంబేద్కర్, బుద్ధిస్టులు, ఛత్రపతి శివాజీపై సావర్కర్ చేసిన వ్యాఖ్యలను మర్చిపోయి.. కేంద్రంలో మెజార్టీ ఉన్న బీజేపీ సర్కారు భారత రత్న ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చని మహారాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ చెప్పారు.
సావర్కర్ ఒక వ్యక్తి కాదు, ఓ ఆలోచన: ఫడ్నవీస్
సావర్కర్ కు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ పై యువసేన ప్రెసిడెంట్, మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాక్రే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. సావర్కర్ అంటే కేవలం ఒక వ్యక్తి కాదని, ఒక ఆలోచన అని మాజీ సీఎం ఫడ్నవీస్ అన్నారు. సావర్కర్ ఆలోచనకు ఇప్పటికీ ప్రాధాన్యత తగ్గలేదని, భవిష్యత్తులోనూ తగ్గదని ఫడ్నవీస్ చెప్పారు.
For More News..
