భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సంచలన నిర్ణయం తీసుకుంది. తన వ్యక్తిగత కోచ్, దక్షిణ కొరియాకు చెందిన పార్క్ టి సాంగ్ సేవలకు గుడ్బై చెప్పి, కొత్త కోచ్ ను వెతుక్కునే పనిలో పడింది. ఈ విషయాన్ని పార్క్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. 2023 సీజన్ ఆరంభం అంత బాగా లేకపోవడం, వరుస వైఫల్యాలు ఎదుర్కోవడమే సింధూ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం. మొదట మెన్స్ సింగిల్స్ కోచ్ గా పనిచేసిన పార్క్.. 2019 వరల్డ్ ఛాంపియన్షిప్ నుంచి సింధు కోచ్ గా ఉన్నాడు. ఇతని కోచింగ్ లో సింధు వరల్డ్ ఛాంపియన్షిప్లో గోల్డ్, టోక్యో ఒలింపిక్స్లో బ్రాంజ్, కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్స్ గెలిచింది.
గాయం కారణంగా టోక్యో వరల్డ్ ఛాంపియన్షిప్ కు దూరమైన సింధూ తర్వత జరిగిన మలేషియా ఓపెన్, ఇండియా ఓపెన్ లలో తొలి రౌండ్లలోనే ఇంటిదారి పట్టింది. బ్యాడ్మింటన్ ఏషియా మిక్స్డ్ టీం ఛాంపియన్షిప్ సెమీఫైనల్లో ఓడిపోయింది. ఈ వార్త చెప్తూ పార్క్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. సింధు వైఫల్యాలకు తనదే బాధ్యత అని చెప్పుకొచ్చారు. సింధు నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు వెల్లడించారు.