- స్థానిక సంస్థలు, చట్ట సభల్లో రిజర్వేషన్లకు రాజ్యాంగాన్ని సవరించండి
- కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: జనాభా ప్రాతిపాదికన విద్య, ఉద్యోగం, స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విధంగా రాజ్యాంగాన్ని సవరించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం పార్లమెంట్ లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసి 17 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
అనంతరం తెలంగాణ భవన్లో కృష్ణయ్య మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతున్న బీసీ ఉద్యమాన్ని అమిత్ షాకు వివరించినట్టు చెప్పారు. పార్లమెంట్లో బీసీ బిల్లుపెట్టి, చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరామన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలయ్యేలా రాజ్యాంగ సవరణ చేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.
బీసీల జనాభా ప్రాతిపదికన కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను 27 నుంచి 56 శాతానికి పెంచాలని కోరినట్లు తెలిపారు. ‘జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. బీసీలకు న్యాయం చేయడంలో బీజేపీ ముందుంటుంది’ అని అమిత్ షా హామీ ఇచ్చినట్లు ఆర్. కృష్ణయ్య వెల్లడించారు.
