కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర మూడో రోజు కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం మణిపూర్ నుంచి నాగలాండ్ వచ్చిన రాహుల్ అక్కడే బస చేశారు. ఇవాళ ఉదయం నుంచి యాత్ర పున:ప్రారంభించారు. నాగాలాండ్లో రెండ్రోజుల పాటు 5 జిల్లాల్లో 257 కిలోమీటర్లు యాత్ర కొనసాగనుంది.
ఆ తర్వాత అస్సాంకు చేరుకొని అక్కడ 8 రోజుల పాటు 17 జిల్లాల్లో 833 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారు. అనంతరం అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఒక్కో రోజు చొప్పున యాత్ర సాగుతుంది. ఇక వరుసగా బెంగాల్లో 5 రోజుల పాటు 7 జిల్లాల్లో 523 కిలోమీటర్లు.. బిహార్లో 4 రోజుల పాటు 7 జిల్లాల్లో 425 కిలోమీటర్లు.. జార్ఖండ్లో 8 రోజుల పాటు 13 జిల్లాల్లో 804 కిలోమీటర్లు.. ఒడిశాలో 4 రోజుల పాటు 4 జిల్లాల్లో 341 కిలోమీటర్లు కొనసాగనుంది.
చత్తీస్ గఢ్లో 5 రోజుల పాటు 7 జిల్లాల్లో 536 కిలోమీటర్లు.. యూపీలో 11 రోజుల పాటు 20 జిల్లాల్లో 1,074 కిలోమీటర్లు.. మధ్యప్రదేశ్లో వారం పాటు 9 జిల్లాల్లో 698 కిలోమీటర్లు సాగుతుంది. చివరగా రాజస్థాన్లో ఒక రోజు, గుజరాత్, మహారాష్ట్రలో 5 రోజుల చొప్పున ఉంటుంది. మార్చి 20 లేదా 21న ముంబైలో యాత్ర ముగుస్తుంది. కాగా, ఈ యాత్ర అత్యధికంగా యూపీలో 11 రోజుల పాటు 1,074 కిలోమీటర్లు సాగుతుంది.