
- ట్రంప్తో భేటీ అయినప్పుడు హెచ్1 బీ వీసాలపై మోదీ ఎందుకు చర్చించలే?
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ఒక అసమర్థ, బలహీన ప్రధానమంత్రి అని.. ఈ విషయాన్ని తాను మొదటి నుంచి చెప్తున్నానని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ అన్నారు. మోదీ తీరు వల్లే అమెరికాలోని లక్షల మంది భారతీయ ఉద్యోగుల భవిష్యత్తు ఆగమవుతున్నదని మండిపడ్డారు. హెచ్1 బీ వీసాల అంశంపై తాను 2017లోనే లేవనెత్తానని, అప్పట్లో అమెరికా వెళ్లినప్పుడు ట్రంప్ (అమెరికా ప్రెసిండెంట్గా ఫస్ట్ టర్మ్)తో మోదీ కనీసం చర్చలు కూడా జరపలేదని ఆయన తెలిపారు.
ట్రంప్ నిర్ణయాలతో భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. దీనికి కారణం మన ప్రధాని మోదీ అసమర్థతేనని శనివారం రాహుల్ ట్వీట్ చేశారు. 2017 జులైలో ట్రంప్తో మోదీ భేటీ అయినప్పుడు, హెచ్ 1 బీ వీసాల అంశాన్ని చర్చికపోవడంపై స్పందిస్తూ ‘భారత్కు బలహీన ప్రధాని ఉన్నడు’ అంటూ అప్పట్లో తాను చేసిన ట్వీట్ను తాజా ట్వీట్కు ఆయన జోడించారు. ‘‘ఇప్పటికీ నేను అదే విషయం చెప్తున్న. భారత్కు బలహీన ప్రధాని ఉన్నడు. మన ప్రధానమంత్రి అసమర్థత వల్లే మన యువతకు కష్టాలు” అని రాహుల్ విమర్శించారు.
ట్రంప్ రిటర్న్ గిఫ్ట్ ఇదా?: ఖర్గే
అమెరికా విధించిన హెచ్ 1 బీ వీసా ఫీజుల పెంపు భారత్పైనే ఎక్కువగా ప్రభావం పడుతుందని.. మన ఫారిన్ పాలసీ దుస్థితికి ట్రంప్ తీసుకుంటున్న దుందుడుకు చర్యలే నిదర్శనమని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. ‘‘ఈ నెల 17న మోదీ బర్త్ డే సందర్భంగా ట్రంప్ ఫోన్ చేసి అభినందించినట్లు తెలిసింది. ఆ తర్వాత ట్రంప్ నుంచి వచ్చిన రిటర్న్ గిఫ్ట్ హెచ్ 1బీ వీసాల ఫీజులను లక్ష డాలర్లకు పెంచడం. ఈ గిఫ్ట్ వల్ల హెచ్ 1 బీ వీసా హోల్డర్లలోని 70% మంది భారతీయులు బాధపడుతున్నరు. మోదీ.. మీ ఫ్రెండ్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదా?” అని ఆయన మండిపడ్డారు.